● ఒక్కొక్కరికి రూ.10 వేలు జరిమానా
నెల్లూరు (లీగల్): అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్నారని నమోదైన కేసులో నేరం రుజువు కావడంతో ఒడిశా ప్రాంతానికి చెందిన కుమార్ దలై, అనిల్కుమార్ జీనాకు ఐదేళ్ల జైలు శిక్ష, ఒక్కొక్కరికి రూ.10 వేలు జరిమానా విధిస్తూ నెల్లూరు మొదటి అదనపు జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి జీ గీత సోమవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం మేరకు.. ఒడిశా నుంచి ఏపీకి గంజాయి సరఫరా జరుగుతున్న సమచారం మేరకు చీరాల రైల్వేస్టేషన్లో 2021 నవంబర్ 28న పోలీసులు తనిఖీ నిర్వహిస్తుండగా సుమారు మూడు గంటల సమయంలో బిలాస్పూర్– తిరుపతి ఎక్స్ప్రెస్ రైలు జనరల్ బోగి నుంచి ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా దిగుతున్న సమయంలో రైల్వే పోలీసులు గుర్తించి తనిఖీలు చేశారు. వారి వద్ద ఉన్న బ్యాగ్లో 15 కేజీల గంజాయిని గుర్తించి మధ్యవర్తుల సమక్షంలో స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి కోర్టుకు హాజరు పరిచారు. దర్యాప్తు అనంతరం కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేయగా, విచారణలో నేరం రుజువు కావడంతో పైమేరకు శిక్ష జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ తరపున అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ షేక్ రఫీ మాలిక్ వాదించారు.


