● రూ.49.24 లక్షల సరుకు సీజ్
నెల్లూరు (క్రైమ్): నెల్లూరు నగరంలోని పలు మొబైల్ యాక్సెసరీస్ విక్రయ దుకాణాలపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సోమవారం దాడులు చేశారు. రూ.49.24 లక్షల సరుకును సీజ్ చేశారు. పలు మొబైల్ యాక్సరీస్ విక్రయ దుకాణాల్లో బిల్లులు లేకుండా వస్తువులు విక్రయిస్తున్నారనీ, జీఎస్టీ ఎగువేస్తూ ప్రభుత్వాదాయానికి గండికొడుతున్నారని విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదులు అందాయి. దీంతో అధికారులు తమ సిబ్బందితో కలిసి సోమవారం లస్సీ సెంటర్, గడ్డంవారివీఽధిలో ని పలు దుకాణాల్లో ఏకకాలంలో తనిఖీలు నిర్వ హించారు. వ్యాపారులు సరైన బిల్లులు లేకుండా మొబైల్ యాక్సెసరీస్, ఎలక్ట్రానిక్ పరికరాలు విక్రయిస్తున్నారని గుర్తించారు. ప్రముఖ కంపెనీలకు చెందిన ఈయర్పోడ్స్, ఛార్జర్లు, నెక్ బ్యాండ్స్ అంటూ నాణ్యతలేని వస్తువులను వినియోగదారులకు అధిక ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నట్లు తనిఖీల్లో వెల్లడైంది. జై అంబికా షాపులో రూ.8,99, 224, శ్రీఅంబికా షాపులో రూ. 22,45,919, జేపీ షాపులో రూ.17,79,439 విలువ చేసే సరుకును సీజ్ చేసి దుకాణాలను మూసివేశారు. మూడు దుకాణాల్లో సీజ్ చేసిన రూ.49,24,582 సరుకును తదుపరి దర్యాప్తు నిమిత్తం జీఎస్టీ అధికారులకు అప్పగించారు. ఈ దాడుల్లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ కే నరసింహరావు, డీసీటీఓ కే విష్ణురావు, వ్యవసాయాధికారి పీ వేణుగోపాల్, ఆఫీసు సూపరింటెండెంట్ శాంతిభూషణ్రెడ్డి, హెడ్కానిస్టేబుల్ వీ హరికృష్ణ, కానిస్టేబుల్ పీవీ సురేష్ తదితరులు పాల్గొన్నారు.


