నెల్లూరు(బృందావనం): నగరంలోని పురమందిరంలో త్యాగరాజ స్మరణోత్సవాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. తొలుత వేదాయపాళెంలోని త్యాగరాజస్వామి మందిరం నుంచి సీతారామ, లక్ష్మణ, హనుమత్ సమేత త్యాగరాజస్వామి ఉత్సవమూర్తులు, చిత్రపటాన్ని ఊరేగింపుగా తీసుకొచ్చి పురమందిర ప్రాంగణంలోని వేదికపై ప్రతిష్టించారు. అనంతరం గణపతిపూజ, పుణ్యాహవచనం, కలశస్థాపనను జరిపారు. హరికథకులతో హరికథలు, ఔత్సాహిక సంగీత కళాకారులతో త్యాగరాజ కృతుల ఆలాపన, శాక్సాఫోన్, కీబోర్డు, గాత్ర కచేరీలు, పంచరత్న గోష్టిగానాన్ని వీనులవిందుగా నిర్వహించారు. తొలి రోజు 120 మంది పాల్గొన్నారని భిక్షాటన పూర్వక త్యాగరాజ స్మరణోత్సవ సభ కమిటీ శాశ్వత కార్యదర్శి యనమండ్ర నాగదేవీప్రసాద్ తెలిపారు.
వీనులవిందుగా గాత్రకచేరి
చైన్నెకి చెందిన సంగీత విద్వాంసులు దీపిక, నందిక బృంద ఆధ్వర్యంలో ప్రధాన గాత్రకచేరిని నిర్వహించారు. వాద్య సహకారాన్ని పప్పు జ్ఞానదేవ్, కిశోర్ రమేష్, హరికిశోర్ అందించారు.


