వీఆర్వోపై దాడి హేయం
● నిందితుడిని
కఠినంగా శిక్షించాలి
● వీఆర్వోల సంఘం డిమాండ్
నెల్లూరురూరల్: కొండాపురం మండలం ఇసుకదామెర్ల వీఆర్వో మురళీకృష్ణపై అదే గ్రామానికి చెందిన సుబ్బారెడ్డి దాడికి పాల్పడడం హేయమైన చర్య అని, వెంటనే అతన్ని కఠినంగా శిక్షించాలని జిల్లా వీఆర్వోల సంఘం కార్యదర్శి డీవీ రమణయ్య డిమాండ్ చేశారు. నగరంలోని జిల్లా జర్నలిస్ట్ భవనలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వీఆర్వోపై దాడి చేయడం అనాగరికమైన చర్యగా భావిస్తున్నామన్నారు. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా ఉండాలంటే నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై ఇప్పటికే జిల్లా కలెక్టర్, ఎస్పీకి కూడా తెలియజేస్తామన్నారు. అదేవిధంగా మిగతా గ్రామ రెవెన్యూ అధికారులకు భరోసా కలిగించే విధంగా శిక్షలు అమలు చేయాలన్నారు. ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గ్రామ రెవెన్యూ అధికారుల సమస్యల పట్ల దశల వారీ ఆందోళన కార్యక్రమంలో భాగంగా 16వ తేదీ సోమవారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో నల్లబ్యాడ్జీలు ధరించి తహసీల్దార్ కార్యాలయం దగ్గర నిరసన కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించామన్నారు. సమస్యలు పరిష్కారమయ్యే వరకు ఆందోళన కార్యక్రమాలలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. సంఘ గూడూరు డివిజన్ ప్రెసిడెంట్ గిద్దలూరు రమణయ్య, ఆత్మకూరు డివిజన్ ప్రెసిడెంట్ బీవీ శేషారెడ్డి, ఆత్మకూరు డివిజన్ సెక్రటరీ సూరిపోగు కృష్ణయ్య, జిల్లా కార్యవర్గ సభ్యుడు కన్నెధార రవిశేఖర్ నాయుడు, గ్రేడ్–2 వీఆర్వో జనరల్ సెక్రటరీ మన్నేపలి రమేష్, గంప ఉదయ్తేజ, నెల్లూరు డివిజన్ కార్యవర్గ సభ్యులు చిన్నారావు చంద్రశేఖర్, ప్రసాద్రావు, గూడూరు డివిజన్ కార్యవర్గ సభ్యులు పుల్లయ్య, దాసరి హనుమంతయ్య, జిల్లా ఉపాధ్యక్షుడు కంచి చంద్రశేఖర్, కార్యవర్గ సభ్యుడు నాగేంద్ర పాల్గొన్నారు.


