లారీని ఢీకొట్టిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు
● తప్పిన పెను ప్రమాదం
కోవూరు: లారీని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టిన ఘటన మంగళవారం కోవూరులో జరిగింది. పోలీసుల కథనం మేరకు.. కొందరు యాత్రికులు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో కన్యాకుమారికి వెళ్లారు. అక్కడి నుంచి విజయవాడకు బయలుదేరారు. ఈ క్రమంలో బస్సు కోవూరు లారీ స్టాండ్ సమీపానికి చేరుకుంది. ముందు వెళ్తున్న లారీ డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేశాడు. దీంతో బస్సు లారీ వెనుక భాగాన్ని ఢీకొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురై కేకలు వేశారు. కొందరికి స్వల్ప గాయాలయ్యాయి. కోవూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పెను ప్రమాదం తప్పడంతో యాత్రికులు ఊపిరి పీల్చుకున్నారు.


