భక్తుల మనోభావాలను దెబ్బతీశారు
● ఎమ్మెల్సీ చంద్రశేఖర్రెడ్డి
నెల్లూరు రూరల్: భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా తిరుమల లడ్డూ ప్రసాదంలో కొవ్వు కలిసిందంటూ కూటమి నేతలు దుష్ప్రచారం సాగించారని ఎమ్మెల్సీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్చార్జి పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి మండిపడ్డారు. కూటమి నేతలకు కనువిప్పు కలగాలని కాంక్షిస్తూ రామలింగాపురంలోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలను పార్టీ నేతలతో కలిసి శనివారం నిర్వహించారు. సీఎం చంద్రబాబు బుద్ధి మారాలంటూ ఆలయ బయట ప్లకార్డులను ప్రదర్శించారు. అనంతరం ఆయన మాట్లాడారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో పంది కొవ్వు కలిసిందంటూ చంద్రబాబు, పవన్ కల్యాణ్ దుష్ప్రచారం సాగించారని ఆరోపించారు. సీబీఐ నివేదిక కూటమి నేతలకు చెంపపెట్టు అన్నారు. భక్తుల మనోభావాలతో ఆడుకుంటే కలియుగ దైవం వెంకటేశ్వరస్వామి క్షమించరని చెప్పారు. నేతాజీ సుబ్బారెడ్డి, పార్టీ రాష్ట్ర సెక్రటరీ పేర్నేటి కోటేశ్వరరెడ్డి, రాష్ట్ర జాయింట్ సెక్రటరీ వేలూరు ఉమామహేష్, జిల్లా ఉపాధ్యక్షుడు మజ్జిగ జయకృష్ణారెడ్డి, కార్పొరేటర్లు శ్రీకాంత్రెడ్డి, కామాక్షిదేవి, మద్దినేని మస్తానమ్మ, విద్యార్థి విభాగ జిల్లా అధ్యక్షుడు ఆశ్రిత్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


