మాటల్లేవ్.. మాట్లాడుకోవడాల్లేవ్..!
కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి (కావ్య కృష్ణారెడ్డి)కి టీడీపీలో అవమానాలు నిత్యకృత్యమవుతున్నాయి. మొన్న దగదర్తిలో నిర్వహించిన మాలేపాటి సుబ్బానాయుడికి ఉత్తరక్రియలకు హాజరైన ఆయన్ను కారు దిగనీయకుండా అడ్డుకోవడంతో వెనుదిరిగిన విషయం విదితమే. ఇది మర్చిపోకముందే తాజాగా మంత్రి లోకేశ్ ఎదుట తీవ్ర పరాభావం ఎదురైంది. ఈ ఉదంతానికి ముసునూరు టోల్గేట్ వేదికై ంది. స్వాగత ఏర్పాట్లను ఆయన చేసినా, జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీ ముందే అవమానం జరిగింది. స్వాగతం వరకే ఆయన్ను పరిమితం చేసి.. ఇక ఇంటికెళ్లమని చెప్పడాన్ని కావ్య వర్గం జీర్ణించుకోలేకపోతోంది.
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డికి టీడీపీలో అడుగడుగునా పరాభవాలే ఎదురవుతున్నాయి. ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, దివంగత మాలేపాటి సుబ్బానాయుడి కుటుంబాన్ని పరామర్శించేందుకు గానూ దగదర్తికి మంత్రి నారా లోకేశ్ గురువారం వచ్చిన సందర్భంలో మరోసారి ఈ అంశం బహిర్గతమైంది.
జరిగిందిదీ..
లోకేశ్కు స్వాగతం పలికేందుకు గానూ ముసునూరు టోల్గేట్ వేదికగా ఏర్పాట్లను కావ్య కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో చేశారు. దీనికి ఎమ్మెల్యేలు, ఎంపీ హాజరయ్యా రు. ఈ తరుణంలో స్వాగతం వరకే ఆయన్ను పరిమితం చేసి.. ఇక ఇంటికెళ్లమని చెప్పడాన్ని ఆయన వర్గం జీర్ణించుకోలేకపోతోంది. ఈ పరిణామం పొమ్మనకుండా పొగబెట్టడమేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మాలేపాటి కుటుంబంలో విషాదానికి ఎమ్మెల్యే వ్యవహారశైలే కారణమని పార్టీ వర్గాలతో పా టు ఆయన సామాజికవర్గం సైతం భావిస్తోంది. ఫలితంగా శాసనసభ్యుడి పెత్తనానికి కత్తెరేయాలని పార్టీ అధిష్టానంపై ఒత్తిడి పెరగడంతోనే ఈ పరిణామం చోటుచేసుకుందనే ప్రచారమూ లేకపోలేదు.
విషాదం తెచ్చిన తంటా
దగదర్తి మండల నేత మాలేపాటి కుటుంబంలో తీవ్ర విషాదం కావలి ఎమ్మెల్యే భవిష్యత్తుపైనే నీలినీడలు కమ్మేలా చేశాయి. పార్టీ జెండా మోసి కష్టకాలంలో అండగా ఉన్న మాలేపాటి గత ఎన్నికల వేళ సీటును త్యాగం చేశారు. అప్పటి వరకు హత్తుకున్న కావ్య.. ఎమ్మెల్యేగా గెలుపొందిన నాటి నుంచి దూరం పెట్టారు. పార్టీ అధికారంలో ఉన్నా, అవమానాలు ఎదురయ్యేలా చేశారు. ఆదిలోనే తుంచాల్సిన పార్టీ అధిష్టానం సైతం పట్టించుకోకపోవడంతో వర్గపోరు ముదిరి పాకానపడింది. ఇంతలోనే మాలేపాటి సుబ్బానాయుడు, ఆయన సోదరుడి కుమారుడు భానుచందర్ మరణం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. దీనంతటికీ కారణం ఎమ్మెల్యే తీరేనంటూ మాలేపాటి సామాజికవర్గం భగ్గుమంది. విషాద సమయంలోనూ టీడీపీ వర్గీయులు పోస్టింగ్లు పెట్టడం, రాజకీయంగా వాడుకోవడం మరింత ఆగ్రహానికి గురిచేసింది. మాలేపాటి సోదరుడి కుమారుడు ఎన్నారై కావడంతో తన కుటుంబానికి జరిగిన అన్యాయంపై పార్టీ అధిష్టానంపై మరింత ఒత్తిడి పెంచి ఎమ్మెల్యే పెత్తనానికి కత్తెరేయిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.
గజమాలతో స్వాగతమా..?
పరామర్శకు వస్తున్న లోకేశ్కు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గజమాలతో స్వాగత ఏర్పాట్లు చేయడం విమర్శలకు దారితీసింది. విషాదంలో ఉన్న కుటుంబాన్ని కలిసేందుకు వచ్చే సమయంలో ముసునూరు టోల్గేట్ వద్ద గజమాలను క్రేన్ ద్వారా వేసేలా ఏర్పాట్లు చేయడం విమర్శలకు తావిచ్చింది.
ఎమ్మెల్యే ఫ్లెక్సీల చించివేత
లోకేశ్ రాక సందర్భంగా దగదర్తి మండలంలోని సున్నపుబట్టి నుంచి ఎమ్మెల్యే వర్గీయులు ఏర్పాటు చేసిన ప్లెక్సీలను సైతం ఆయన వ్యతిరేక వర్గం చించేయడం కలకలం రేపింది. లోకేశ్, ఎమ్మెల్యే ఫొటోలతో పాటు స్థానిక మండల నేత పమిడి రవికుమార్చౌదరి ఫొటో ఉండటంతో ఇలా వ్యవహరించారనే టాక్ నడుస్తోంది.
ముఖం చాటేసిన మంత్రులు
పార్టీలో కీలకనేత లోకేశ్ పర్యటనకు జిల్లా మినస్టర్లు ముఖం చాటేశారు. విదేశీ పర్యటనలో ఉన్న నారాయణ గురువారం ఉదయమే స్వదేశానికి వచ్చారు. రామనారాయణరెడ్డి సైతం డుమ్మా కొట్టారు. కావలి ఎమ్మెల్యేతో సన్నిహితంగా ఉండటం.. మాలే పాటి కుటుంబాన్ని ఇప్పటి వరకు పరామర్శించకపోవడం.. పర్యటనకు ముఖం చాటేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
బీదకే పవర్స్..?
అంతా.. పక్కాగా
కలెక్టర్, జేసీని బీద కలవడం.. లోకేశ్ ప్రోగ్రామ్లో ఎమ్మెల్యేకు అవమానం జరిగేలా స్కెచ్ వేశారనే ప్రచారం ఉంది. ఎమ్మెల్యేగా గెలుపొందిన నాటి నుంచి కావ్య వ్యవహరించిన తీరును లోకేశ్కు మాలేపాటి కుటుంబం ద్వారానే చెప్పించారని తెలుస్తోంది. ఆయన మరణానంతరం చోటుచేసుకున్న పరిణామాలు.. పోస్టింగ్ల వ్యవహారంపై అన్ని ఆధారాలతో సహా పూసగుచ్చినట్లు చెప్పించి.. శాసనసభ్యుడి పవర్స్ను కట్ చేయించేలా చేస్తున్నారనే ప్రచారం ఉంది. బీద వ్యూహం ఫలించందని ఆ పార్టీ వర్గాలే పేర్కొంటున్నాయి.
కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డిని దగదర్తికి రానీయని లోకేశ్
ముసునూరు టోల్గేట్ వద్ద నుంచే సాగనంపిన వైనం
అడుగడుగునా వ్యతిరేకత..
అడ్డగింతలు.. అవమానాలు
శాసనసభ్యుడి పెత్తనానికి
కత్తెరేయిస్తున్న బీద
గజమాలతో స్వాగతంపై ఆగ్రహం
మాలేపాటి కుటుంబానికి
పరామర్శలో ఇదీ పరిస్థితి
మాలేపాటి ఎపిసోడ్ అనంతరం కావలి టీడీపీలో ప్రధాన పాత్రను ఎమ్మెల్సీ బీద రవిచంద్ర పోషిస్తున్నారు. తన ఆత్మీయుడి మరణానికి కావ్య తీరే కారణమంటూ కన్నెర్ర చేశారు. కుటుంబానికి అండగా ఉంటూ శాసనసభ్యుడి పవర్స్కు వ్యూహాత్మకంగా చెక్ పెట్టేలా వ్యవహరిస్తున్నారనే ప్రచారం ఉంది. ఇందులో భాగంగానే అడుగడుగునా అవమానాలు చోటు చేసుకునేలా పథక రచన జరిగిందని కావ్య వర్గం భావిస్తోంది. నియోజకవర్గ పెత్తనాన్ని తమ చేతుల్లోకి తీసుకునేలా బీద బ్రదర్స్ వ్యవహరిస్తున్నారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ఉంది.
మాటల్లేవ్.. మాట్లాడుకోవడాల్లేవ్..!


