కాలువలో పడి కాంట్రాక్టర్ మృతి
సంగం: మండలంలోని ర్యాంపు నుంచి పల్లిపాళెం వెళ్లే రహదారి పక్కనున్న కనిగిరి రిజర్వాయర్ ప్రధాన కాలువలో పడి ఓ కాంట్రాక్టర్ మృతిచెందాడు. ఈ ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. కాలువలో స్కూటీ, మృతదేహాన్ని గురువారం స్థానికులు గుర్తించి సంగం పోలీసులకు సమాచారం అందించారు. వారొచ్చి స్కూటీ, కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని బయటకు తీయించారు. వాహన నంబర్ ఆధారంగా మృతుడి బంధువులకు సమాచారం అందించారు. అతని తమ్ముడు వచ్చి కన్నీరుమున్నీరయ్యాడు. పోలీసులు వివరాలు ఆరా తీశారు. చనిపోయిన వ్యక్తిని నెల్లూరు వేదాయపాళెం చైతన్యపురి కాలనీలో ఓ అపార్ట్మెంట్లో ఉండే ఇనుకుర్తి మనోజ్ కుమార్ (57)గా గుర్తించారు. ఇతను ప్రభుత్వ కాంట్రాక్ట్లు చేస్తుంటాడు. ఈనెల 2వ తేదీ మధ్యాహ్నం కారు డ్రైవర్ను తీసుకుని స్కూటీపై నెల్లూరు నుంచి సంగం ర్యాంపు వద్దకు వచ్చాడు. మనోజ్ డ్రైవర్కు కొంత స్థలం చూపించి ఇక్కడ పని వచ్చిందని, జంగిల్ క్లియరెన్స్ చేయించాలని చెప్పాడు. నాకు వేరే పని ఉంది నెల్లూరుకు తర్వాత వస్తానని చెప్పి డ్రైవర్ను బస్సు ఎక్కించి పంపాడు. అర్ధరాత్రి అయినా భర్త ఇంటికి రాకపోవడంతో అతని భార్య మాధవి ఆందోళన చెంది మరిది మౌనీష్కు చెప్పింది. మౌనిష్ డ్రైవర్తో మాట్లాడి విషయం తెలుసుకున్నాడు. 3వ తేదీన ఇద్దరూ ర్యాంపు వద్ద గాలించారు. ఫోన్ చేసినా స్విచ్ఛాఫ్ రావడంతో మనోజ్ కుమార్ బంధువుల ఇళ్లకు వెళ్లి ఉంటాడని భావించారు. సంగం పోలీసులు మనోజ్ చనిపోయిన విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పారు. ఎస్సై రాజేష్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మౌనిష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బహిర్బూమికి వెళ్లి కాలువలో పడి తన అన్న చనిపోయి ఉండొచ్చని ఫిర్యాదులో పేర్కొన్నాడు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.
కాలువలో పడి కాంట్రాక్టర్ మృతి


