
ఉద్యోగాల పేరుతో మోసాలు
● ఫిర్యాదులు స్వీకరించిన ఎస్పీ
నెల్లూరు(వీఆర్సీసెంటర్): ఉద్యోగం ఇప్పిస్తామని నగదు తీసుకుని మోసం చేశారని పలువురు ఫిర్యాదు చేశారు. సోమవారం నెల్లూరులోని ఉమేష్చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. 109 మంది ఫిర్యాదులు అందజేశారు. తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఎస్పీ కృష్ణకాంత్ ఆదేశించారు. లీగల్ అడ్వైజర్ శ్రీనివాసులురెడ్డి, మహిళా పోలీస్స్టేషన్ డీఎస్పీ రామారావు, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ శ్రీనివాసరావు, డీఆర్సీబీ సీఐ రామారావు, ఎస్బీ – 2 సీఐ శ్రీనివాసరెడ్డి, వెల్ఫేర్ ఆర్ఐ రాజారావు పాల్గొన్నారు.
ఫిర్యాదుల్లో కొన్ని..
u సంతపేట ప్రాంతానికి చెందిన మాబ్జాన్ అనే మహిళ శివశంకర్, సునయన అనే వారిని పరిచయం చేసి ప్రభుత్వ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి రూ.6,56,000 నగదు తీసుకున్నారు. అయితే ఉద్యోగం ఇప్పించలేదని ఓ మహిళ ఫిర్యాదు చేశారు.
u నవీన్కుమార్ అనే వ్యక్తి హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం ఇప్పిస్తానని రూ.11 లక్షలు తీసుకుని మోసం చేశాడని కావలి పట్టణానికి చెందిన ఓ వ్యక్తి వినతిపత్రమిచ్చాడు.
u సంగం మండల ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ద్వారా గుంటూరుకు చెందిన సయ్యద్ వారిస్, సాంబశివరావు పరిచయమై కౌన్సెలింగ్ – కెరీర్ డెవలప్మెంట్ ఉద్యోగాలు ఇప్పిస్తామని రూ.36 లక్షలు తీసుకుని నకిలీ అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చి మోసం చేశారు. నగదు తిరిగి ఇవ్వడం లేదని నెల్లూరు నగరానికి చెందిన బాధితులు ఫిర్యాదు చేశారు.
u హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్న సమయంలో జలదంకికి చెందిన శివారెడ్డి అనే వ్యక్తి ప్రేమిస్తున్నాని మోసం చేశాడు. పెళ్లి చేసుకోవడానికి నిరాకరిస్తున్నాడని ఓజిలి గ్రామానికి చెందిన ఓ మహిళ అర్జీ ఇచ్చారు.
u పొలంలోని వంద టేకు చెట్లను గుర్తుతెలియని వ్యక్తులు నరికారు. దీనిపై గత నెల 26వ తేదీన పొదలకూరు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, నిందితులపై చర్యలు తీసుకోవాలని పొదలకూరు మండలం మరువూరు గ్రామానికి చెందిన కందకట్ట రాజేశ్వరి కోరారు.
u ఓ వ్యక్తి బ్యాంక్ అధికారినంటూ ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. రూ.3 లక్షల లిమిట్ ఉన్న క్రెడిట్ కార్డు మంజూరైందని చెప్పాడు. బ్యాంక్ వివరాలు తీసుకుని రూ.1,21,480లు స్వాహా చేశాడని బుచ్చిరెడ్డిపాళెం ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు.
u కొడుకు, కోడలు నన్ను పట్టించుకోవడం లేదు. నా ఆస్తిని వినియోగించుకుంటూ ఇబ్బంది పెడుతున్నారని ఏఎస్పేట ప్రాంతానికి చెందిన ఓ వృద్ధుడు అర్జీ ఇచ్చాడు.
u నా భర్త నిత్యం మద్యం తాగొచ్చి చిత్రహింసలకు గురిచేస్తున్నాడు. కన్నబిడ్డలను పట్టించుకోవడం లేదని నెల్లూరు నగరం వేదాయపాళేనికి చెందిన ఓ మహిళ ఫిర్యాదు చేసింది.
u నా భర్త వివాహేతర సంబంధం పెట్టుకుని కుటుంబం గురించి పట్టించుకోవడం లేదు. అత్తమామలు ఆయనకు తోడ్పాటు అందిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారు. కాపురాన్ని చక్కదిద్దాలని నెల్లూరు రూరల్ ప్రాంతానికి చెందిన ఓ మహిళ వినతిపత్రమిచ్చింది.