
ఘటోత్సవ వైభవం
● ప్రారంభమైన
వెంకటగిరి జాతర
వెంకటగిరి(సైదాపురం): వెంకటగిరి గ్రామదేవత పోలేరమ్మ జన జాతర అంగరంగ వైభవంగా ఆదివారం ప్రారంభమైంది. ఘటోత్సవంతో అమ్మవారి సంబరం అంబరాన్నంటింది. ఘటోత్సవం చూసేందుకు తరలివచ్చిన అశేష భక్త జనంతో వెంకటగిరి పట్టణ పురవీధులు కిక్కిరిశాయి. పోలేరమ్మ తల్లీ చల్లగా చూడాలమ్మా అంటూ వేడుకున్నారు. ఘటం కుండలకు అధిక సంఖ్యలో భక్తులు పూజలు నిర్వహించి ఆధ్యాత్మికతను చాటుకున్నారు. ఘటం కుండలతో ఇంట్లో పూజలు చేస్తే సాక్షాత్తు పోలేరమ్మ తల్లే కొలువై ఉంటుందన్న విశ్వాసం. దీంతో అమ్మవారి ఘటోత్సవానికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులను తీర్చుకున్నారు.
భక్తుల ఆగ్రహంతో..
రాష్ట్ర పండగైన వెంకటగిరి పోలేరమ్మ తల్లి జాతర సందర్భంగా ఘటోత్సవంలో సంప్రదాయాలకు విరుద్ధంగా కొత్త విధానాలకు తెరలేపడంతో భక్తుల ఆగ్రహించారు. దీంతో పాత పద్ధతిలోనే కొనసాగించారు. వివరాలిలా.. ఘటోత్సవంలో సంప్రదాయాలను తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా వ్యవహరించడం భక్తుల మనోభావాలు దెబ్బతీశాయి. వాస్తవానికి ఘటోత్సవం జీనుగుల వారి వీధిలోని మెట్టినింటి మండపం వద్ద నుంచి రాజా ప్యాలెస్కు నడక మార్గంలో ఘటం కుండలను ఊరేగించడం ఆనవాయితీ. ఈ ఏడాది పక్కన పెట్టి గతంలో ఎప్పుడూ లేని విధంగా ఘటం కుండలను ఊరేగించేందుకు ప్రత్యేక వాహనంలో జీనుగుల వారి వీధిలోని అమ్మ మెట్టి నింటి మండపం వద్ద ఎక్కించేశారు. ఘటం కుండలు నడక మార్గం గుండా రాకపోవడంతో స్థానికంగా ఉన్న పట్టణ ప్రముఖులు ఆగ్రహించారు. దీంతో పోలీసు బందోబస్తు మధ్య యథావిధిగా కాలి నడక ద్వారా సాగించారు.
యువత కేరింతలు
జాతరలో తొలి ఘట్టం ఘటోత్సవం ఆరంభమైన నేపథ్యంలో పట్టణంలోని యువత, మహిళలు పెద్ద సంఖ్యలో జీనుగులవారి వీధిలోని అమ్మవారి మెట్టినింటి మండపం వద్దకు చేరుకున్నారు. మండపంలో అమ్మవారి ఘటము (కుండ)లకు స్థానిక ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ, ఆలయ అధికారుల సమక్షంలో ప్రత్యేక పూజలు చేశారు. అక్కడి నుంచి ఘటం కదిలి ఆంజనేయస్వామి దేవస్థానం, బజారు వీధి, పోలేరమ్మ తల్లి దేవస్థానం, రాజా ప్యాలెస్ మీదుగా సాగింది. యువతతోపాటు మహిళలు కూడా పెద్ద సంఖ్యలో హాజరై కుండలను తాకేందుకు పోటీ పడ్డారు. రాజా ప్యాలెస్లో వెనుక భవనం వద్దకు చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. అక్కడ యువత అధిక సంఖ్యలో చేరుకోవడంతో బారికేడ్లను ఏర్పాటు చేసి పోలీసులు ఎక్కడికక్కడ కట్టడి చేశారు. అమ్మవారికి బలి ఇచ్చే దున్నపోతును ఘటంకు ముందుగా నడిపించుకుంటూ తీసుకొచ్చి పూజలు చేశారు. ఐదురోజులపాటు గురువారం వరకు ఈ ఘటం పట్టణంలోని అన్ని వీధుల్లోనూ తిరుగుతుంది. ఆలయ ఈఓ శ్రీనివాసులురెడ్డి, సీఐ ఏవీ రమణ పర్యవేక్షణతో కార్యక్రమాన్ని అంగరంగా వైభవంగా నిర్వహించారు.

ఘటోత్సవ వైభవం