
స్వర్ణాల సంబరం
జనసంద్రంగా మారిన స్వర్ణాల చెరువు
నెల్లూరు(బారకాసు): నెల్లూరులో జరుగుతున్న రొట్టెల పండగకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. బారాషహీద్లకు లేపనం చేసిన గంధాన్ని అందుకునేందుకు భక్తులు పోటీ పడ్డారు. అనంతరం వరాల రొట్టెలు అందుకునేందుకు వచ్చిన వారితో స్వర్ణాల ఘాట్ కిక్కిరిసింది. తెలుగు రాష్ట్రాలతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులతో మంగళవారం నెల్లూరులోని అన్ని రోడ్లు నిండిపోయాయి.
స్వర్ణాల ఘాట్లు కిటకిట
రొట్టెల పండగలో ముఖ్యమైన గంధ మహోత్సవం ముగియడంతో భక్తుల తాకిడి పెరిగింది. దర్గాలో బారాషహీద్లను దర్శించుకునేందుకు భక్తులు గంటల కొద్దీ క్యూలైన్లలో నిరీక్షించాల్సి వచ్చింది. మూడోరోజు కూడా దర్గా ప్రాంగణంలో అన్నదానం నిర్వహించారు. జిల్లా వైద్యారోగ్యశాఖతోపాటు పలు కార్పొరేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు దర్గా ప్రాంగణంలో ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేశాయి.
వరాల రొట్టెకు డిమాండ్
స్వర్ణాల తీరంలో పలు రొట్టెలకు డిమాండ్ పెరిగింది. ప్రధానంగా ఉద్యోగం, వివాహం, సంతాన రొట్టెల కోసం గంటల కొద్దీ భక్తులు నిరీక్షించాల్సి వచ్చింది. అధిక మంది ఆయా రొట్టెలను పట్టుకునేందుకు ఘాట్ వద్ద పోటీ పడ్డారు. అలాగే ధన, ప్రమోషన్, చదువు, సౌభాగ్య, విదేశీయాన తదితర రొట్టెలకు కూడా డిమాండ్ ఉంది.
ఆధ్యాత్మిక శోభ
నెల్లూరు(బృందావనం): మతసామరస్యానికి ప్రతీకగా సింహపురి వేదికగా జరుగుతున్న రొట్టెల పండగ సందర్భంగా బారాషహీద్ దర్గా వద్ద ఆధ్యాత్మిక శోభ నెలకొంది. సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజాము వరకు జరిగిన బారాషహీద్ల గంధ మహోత్సవంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. విద్యుద్దీప కాంతుల్లో దర్గా ప్రాంగణం శోభిల్లుతుంటే మరోవైపు బారాషహీద్ల దర్గా ప్రాంగణంలోని స్వర్ణాల చెరువు కిటకిటలాడుతోంది. ప్రాంగణంలో ఏర్పాటైన వివిధ రకాల దుకాణాల వద్ద కోలాహలం నెలకొంది. ఐదురోజుల రొట్టెల పండగలో బుధవారం సంప్రదాయంగా బారాషహీద్లను స్మరిస్తూ ‘తహలీల్ ఫాతేహ’ (చదివింపులు) నిర్వహిస్తారు. భక్తులు తమ మొక్కులు తీర్చుకుంటారు. గురువారం ముగింపు వేడుకలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఐదురోజులు పండగను జయప్రదం చేసిన అధికార యంత్రాంగానికి అభినందన కార్యక్రమం జరగనుంది.
రొట్టెల పండగకు
మూడోరోజూ పోటెత్తిన భక్తులు
దర్శనానికి గంటల కొద్దీ నిరీక్షణ

స్వర్ణాల సంబరం

స్వర్ణాల సంబరం

స్వర్ణాల సంబరం

స్వర్ణాల సంబరం