
ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వ వైఫల్యాలు చెప్పండి
● పీసీసీ అధ్యక్షురాలు షర్మిల
నెల్లూరు (వీఆర్సీసెంటర్): రాష్ట్రంలో తాను పాదయాత్ర చేయడం ముఖ్యం కాదని, ప్రజల వద్దకు వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకుని, ప్రభుత్వ వైఫల్యాలపై నిలదీయాలని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులతో నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశానికి ఆమె మంగళవారం నగరానికి విచ్చేశారు. నగరంలోని పీఎస్ఆర్ కల్యాణ మండపం నుంచి ర్యాలీగా బయలుదేరిన ఆమె గాంధీబొమ్మ సెంటర్లోని దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఇందిరాభవన్లో నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. పలువురు నాయకులు ఆమెను రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేయాలని కోరారు. దీంతో ఆమె తన పాదయాత్ర ముఖ్యం కాదని, రాష్ట్రంలో సూపర్సిక్స్ పథకాల అమల్లో ప్రభుత్వ వైఫల్యాలను వివరించాలని సూచించారు. పక్కనే ఉన్న తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయని, రానున్న కాలంలో కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేలా ప్రజల నమ్మకాన్ని సంపాదించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా ఇన్చార్జి గోపాల్రెడ్డి, ఓబీసీ సెల్ అధ్యక్షుడు నాగరాజు, కిసాన్ సెల్ అధ్యక్షుడు ప్రభాకర్, కమాలాకర్, డీసీసీ అధ్యక్షుడు దేవకుమార్రెడ్డి, నగర అధ్యక్షుడు కిరణ్కుమార్రెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షుడు బాలసుధాకర్, డాక్టర్ యశోధర, సంజయ్, నియోజకవర్గాల సమన్వయకర్తలు, నాయకులు తదితరులు పాల్గాన్నారు.