
పెన్నా కలుషితంపై నేడు కలెక్టర్ విచారణ
● ఎన్జీటీకి ఫిర్యాదు చేసిన జొన్నవాడ వాసి
బుచ్చిరెడ్డిపాళెం రూరల్: జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం జొన్నవాడ కామాక్షితాయి ఆలయ పరిసరాల్లోని పవిత్ర పినాకిని నది మురుగు జలాలతో కలుషితం కావడంపై కలెక్టర్ ఆనంద్ బుధవారం విచారణ చేపట్టనున్నారు. పెన్నానది కలుషితమవుతోందని జొన్నవాడకు చెందిన సింగిరి మధు అనే వ్యక్తి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కు గత నెలలో ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా జొన్నవాడలోని మలికార్జున సమేత కామాక్షితాయి ఆలయానికి దేశంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు పెన్నానదిలో పుణ్య స్నానాలు ఆచరిస్తుంటారని, అలాంటి పవిత్ర తీరంలో గ్రామానికి చెందిన మురుగునీరు నదిలోకి వదిలేయడంతో కలుషితమవుతోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదును స్వీకరించిన ఎన్జీటీ చైన్నెలోని సౌత్జోన్ బెంచ్కు బదిలీ చేసింది. ట్రిబ్యునల్ ప్రిన్సిపల్ బెంచ్కు చెందిన జస్టిస్ అరుణ్కుమార్ త్యాగి, డాక్టర్ అప్రోజ్ అహ్మద్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, జలవనరుల, పర్యావరణ, అడవులు, వాతావరణ మార్పుల విభాగం కార్యదర్శులు, ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శితోపాటు కలెక్టర్ను బాధ్యులుగా చేస్తూ గత నెల 29న ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్జీటీ ఆదేశాల మేరకు కలెక్టర్, ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి సభ్యులు బుధవారం జొన్నవాడ ఆలయ పరిసరాల్లో విచారణ చేపట్టనున్నారు. నదీ జలాలు కాలుష్యం, చెత్త తదితర వస్తువులు నదిలో కలవడంపై సమగ్ర విచారణ జరిపి నివేదికను ఎన్జీటి చైన్నె బెంచ్కు అందించనున్నారు. ఆగస్టు 8న ఎన్జీటీ బాధ్యులుగా గుర్తించిన సభ్యులందరూ బెంచ్ ముందు హాజరై వివరణ ఇవ్వాల్సి ఉంది.

పెన్నా కలుషితంపై నేడు కలెక్టర్ విచారణ