
పురావస్తుశాఖ అధికారుల పరిశీలన
ఉదయగిరి: ఉదయగిరిలోని రాయల కాలం నాటి చారిత్రాత్మక నేపథ్యం ఉన్న పలు కట్టడాలను మంగళవారం పురావస్తు, ఆర్కియాలజీ శాఖల అధికారులు పరిశీలించారు. శిథిలమవుతున్న పలు కట్టడాలకు ఏ విధంగా రక్షణ కల్పించాలనే అంశంపై స్థానికులతో చర్చించారు. ప్రాముఖ్యత ఉన్న దేవాలయాలను పురావస్తు శాఖ నుంచి దేవదాయశాఖకు మార్పు చేయాలని కోరారు. ఇందుకు అధికారులు స్పందించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతామన్నారు. ఆర్కియాలజీ సూపరింటెండెంట్ ఇన్స్పెక్టర్ పీఎన్ భాయి, డిప్యూటీ సూపరింటెండెంట్ ఎం.సాంబశివకుమార్, అసిస్టెంట్ ఇంజినీర్ ప్రవీణ్కుమార్, ఒంగోలు పురావస్తు శాఖ అధికారి యశ్వంత్రెడ్డి, తదితరులున్నారు.
కూలీల సంఖ్య పెంచండి
నెల్లూరు (పొగతోట): ఉపాధి హామీ పనులకు హాజరయ్యే కూలీల సంఖ్యను రోజుకు లక్షకు తగ్గకుండా పెంచాలని డ్వామా పీడీ గంగాభవాని అధికారులను ఆదేశించారు. మంగళవారం డ్వామా కార్యాలయం ఏపీఓలు, ఈసీలు, టీఏలతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్లో పీడీ మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో పనులను గుర్తించి కూలీలకు పనిదినాలు కల్పించాలన్నారు. ఈ విషయంలో నిర్లక్ష్యం వహించే సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఉపాధి నిధులతో గతంలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, ఇతర నిర్మాణాలు చేపట్టారన్నారు. అందుకు సంబంధించి పాత బకాయిలు రూ.50 కోట్ల బిల్లులు చెల్లించామన్నారు. మిగిలిన బిల్లులు త్వరలో చెల్లిస్తామని తెలిపారు. పంట కుంటల లక్ష్యాలను పూర్తి చేయాలని తెలిపారు.
నేడు మంత్రి
సంధ్యారాణి పర్యటన
నెల్లూరు రూరల్: రాష్ట్ర మహిళ, శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి బుధవారం నెల్లూరులో పర్యటించనున్నట్లు కలెక్టర్ ఓ ఆనంద్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 గంటలకు నెల్లూరుకు చేరుకుని మధ్యాహ్నం ఒంటి గంట వరకు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో మహిళా,శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమ శాఖల సమీక్ష సమావేశంలో పాల్గొంటారు. 2 గంటల నుంచి 2:30 వరకు అధికారులో మాట్లాడుతారు. 2:30 గంటలకు విలేకరుల సమావేశం అనంతరం తిరిగి రోడ్డు మార్గంలో విజయవాడకు వెళ్తారని పేర్కొన్నారు.
సాగునీటి కాలువల
ఆక్రమణల పరిశీలన
● లోకాయుక్త ఆదేశాలతో
ఆత్మకూరు: ఆత్మకూరు చెరువు పరిధిలో పలు సాగునీటి కాలువల ఆక్రమణలను మంగళవారం ఇరిగేషన్ చీఫ్ ఇంజినీర్ వరప్రసాద్, తిరుపతి, నెల్లూరు ఎస్ఈ దేశ్నాయక్, ఆత్మకూరు ఈఈ ఎం.రవి, ఏఈ రవికుమార్రెడ్డి, తహసీల్దారు పద్మజాకుమారి తదితరుల బృందం పరిశీలించింది. సాగునీటి కాలువలు ఆక్రమణలకు గురయ్యాయని లోకాయుక్తకు ఫిర్యాదులు వెళ్లాయి. లోకాయుక్త ఆదేశాల మేరకు పట్టణంలోని స్పార్క్ సిటీ ప్రాంతం నుంచి చెరువు వరకు ఉన్న కాలువలను, అలుగులను, సోమశిల రోడ్డు మలుపు వద్ద కాలువను ఆక్రమించి నిర్మించిన భవనాలను పరిశీలించారు. ఈ సందర్భంగా చీఫ్ ఇంజినీరు వరప్రసాద్ మాట్లాడుతూ చెరువు నుంచి పొలాలకు వెళ్లే సాగునీటి కాలువలు పలుచోట్ల ఆక్రమణలకు గురైనట్లు గుర్తించామన్నారు. దీంతో పైర్లకు సాగు నీరందక రైతులు పడుతున్న ఇబ్బందులపై పూర్తి వివరాలను లోకాయుక్తకు నివేదిక అందజేస్తామన్నారు. వారి ఆదేశానుసారం తదుపరి చర్యలు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ శాఖ సిబ్బంది కొండయ్య, మున్సిపల్ సిబ్బంది ఉన్నారు.

పురావస్తుశాఖ అధికారుల పరిశీలన

పురావస్తుశాఖ అధికారుల పరిశీలన