
కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో మీడియాతో మంత్రి గుమ్మడి సంధ్యారాణి
నెల్లూరు రూరల్: జిల్లాలో ఆధార్, రేషన్ కార్డులు లేని గిరిజనులకు వచ్చే ఆగస్టు 15 లోపు వాటిని అందిస్తామని రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో బుధవారం మీడియాతో మాట్లాడారు. మారుమూల పల్లెల్లో తాగు, సాగునీరు, మౌలిక వసతుల కల్పన ఐటీడీఏ ప్రథమ కర్తవ్యమన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో గిరిజనాభివృద్ధికి గతే డాది రూ.1,300 కోట్ల నిధులు వ్యయం చేశామన్నారు.
ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన పథకం ద్వారా 206 రోడ్లకు రూ.550 కోట్ల నిధులు వ్యయం చేశామన్నారు. కావలి, తిరుపతి జిల్లా కేవీపల్లి గురుకుల పాఠశాలల అభివృద్ధికి దాదాపు రూ.18 కోట్ల నిధులు మంజూరు చేశామన్నారు. రాష్ట్రంలోని ప్రతి అంగన్వాడీలో మౌలిక వసతుల అభివృద్ధి కోసం రూ.లక్ష నిధులు మంజూరు చేశామన్నారు.
రాష్ట్రంలోని 6,800 మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చడంతో ప్రత్యేక టీచర్, ఆయాలను నియమిస్తున్నామన్నారు. అనంతరం మంత్రి కలెక్టర్తో కలిసి గిరిజన సంక్షేమ విద్యార్థులకు కాస్మోటిక్ కిట్లు, అంగన్వాడీ సిబ్బందికి స్టడీ మెటీరియల్, సామగ్రిని అందజేశారు. అనంతరం అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గిరిజన బాలిక చెంచమ్మను పరామర్శించి, రూ.50 వేల ఆర్థిక సాయం అందజేశారు. ఐసీడీఎస్ పీడీ హేనాసుజన్, ఐటీడీఏ పీఓ మల్లికార్జునరెడ్డి పాల్గొన్నారు.