
చోరీ చేసి వాహనంలో తెస్తున్న మోటారు
దొంగతనం చేసి పారిపోయే యత్నంలో రోడ్డు ప్రమాదం
యువకుడి మరణానికి కారణం
టీడీపీ నేతల ఒత్తిడితో చోరీ కేసు నమోదులో జాప్యం
కేసుల్లేకుండా రూ.5 లక్షల వరకు బేరాలు
ఎట్టకేలకు ప్రమాదంతోపాటు చోరీ కేసు నమోదు
కోవూరు: కోవూరు మండలం జమ్మిపాళెంలో మోటార్ చోరీ, రోడ్డు ప్రమాదానికి సంబంధించి టీడీపీ దొంగల కట్టు కథలు బెడిసి కొట్టాయి. ఆదివారం రాత్రి పడుగుపాడుకు చెందిన టీడీపీ కార్యకర్తలు ప్రసాద్, మణి, శ్రీహరి, శ్రీనివాసులు కలిసి టాటా ఏస్ వాహనంలో జమ్మిపాళెంలోని జగనన్న కాలనీలో తాగునీటి పథకానికి ఏర్పాటు చేసిన మోటార్లను చోరీ చేసి పరారయ్యే ప్రయత్నంలో రోడ్డు ప్రమాదానికి కారణమై ఓ యువకుడి దుర్మరణానికి బాధ్యులైన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటన జరిగిన నిమిషాల్లోనే నిందితులను కాపాడేందుకు షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్న ఇందుకూరుపేటకు చెందిన ఓ ముఖ్య నేత సూచనలతో కోవూరుకు చెందిన టీడీపీ నేతలు పోలీస్స్టేషన్ ముందు వాలిపోయారు. నిందితులపై ఏ కేసు కట్టకుండా ఒక రోజంతా పోలీసులపై ఒత్తిడి తెచ్చారు.
ప్రమాద ఘటనపై బంధువుల విమర్శలతో..
ఈ ప్రమాదంలో నెల్లూరులోని ఓ షాపింగ్ మాల్లో క్యాషియర్గా పనిచేస్తున్న జమ్మిపాళెంకు చెందిన సుధీర్బాబు దుర్మరణం చెందాడు. అయితే ప్రమాదానికి కారణమైన నిందితులు ఘటనా స్థలంలోనే తప్పించుకునే ప్రయత్నం చేశారు. సుధీర్బాబు డ్యూటీ ముగించుకుని స్వగ్రామం జమ్మిపాళెం వెళ్తున్న సమయంలో అతని బంధువులు ఓ ఫంక్షన్కు వెళ్లి వెళ్తున్నారు. వీరిని క్రాస్ చేసి సుధీర్బాబు ముందుగా వెళ్లిపోయాడు. అయితే నిందితులు అదే గ్రామ సమీపంలోని జగనన్న కాలనీలో తాగునీటి మోటార్లు చోరీ చేసి స్థానికుల కంట పడడంతో వాహనంతో సహా పారిపోయే ప్రయత్నంలో మితిమీరిన వేగంతో వస్తూ ఎదురుగా బైక్పై వస్తున్న సుధీర్బాబును ఢీకొన్నారు. దీంతో సుధీర్బాబు రోడ్డుపై పడిపోవడంతో నిందితులు ఆగి అతన్ని పరిశీలిస్తున్నారు. ఇంతలోనే వెనుకనే వచ్చిన అతని బంధువులు వచ్చి చూసి అడగడంతో ముందు వెళ్లిన ఏదో వాహనం ఢీకొట్టి వెళ్లిపోయిందని, తాము ఆగి చూస్తున్నామంటూ బుకాయించారు. దీంతో వారి బంధువులు సుధీర్బాబు మమ్మల్ని క్రాస్ చేసి కొన్ని క్షణాలు ముందే వచ్చాడు. మాకు ఎదురుగా ఏ వాహనం రాలేదు. మీరే ఢీకొట్టి నాటకాలు ఆడుతున్నారంటూ నిలదీయడంతో వారి నుంచి తప్పించుకుని పరారయ్యారు.
ఈ ఘటన తర్వాత కోవూరుకు చెందిన టీడీపీ నేతలు పోలీస్స్టేషన్కు చేరుకుని కేసు నమోదు కాకుండా ప్రైవేట్ పంచాయితీ నడిపారు. బాధిత కుటుంబానికి రూ.2 లక్షలు ఇస్తామని బేరం పెట్టారు. అయితే బాధిత కుటుంబ బంధువులు రూ.30 లక్షల డిమాండ్ చేశారు. చివరకు టీడీపీ నేతలు రూ.5 లక్షల వరకు ఇపిస్తామని బేరసారాలు చేశారు. అయితే ఈ పంచాయితీ తెగకపోవడంతో సోమవారం రాత్రి రోడ్డు ప్రమాదంపై కేసు నమోదు చేసి పోలీసులు చేతులు దులుపుకున్నారు. దొంగతనం కేసు అయితే నమోదు చేయలేదు. నిందితులు మొదట చోరీ చేసి, ఆ తర్వాత రోడ్డు ప్రమాదానికి కారణమైనట్లు మీడియాల్లో కథనాలు రావడంతో పోలీసులు చోరీ కేసు కట్టడం గమనార్హం.
ఎవరికి వారు టీడీపీ నేతలు సైలెంట్
రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడి దుర్మరణానికి కారణమైన నిందితులు టీడీపీ వర్గీయులు కావడంతో షాడో ఎమ్మెల్యే ప్రోద్బలంతో కోవూరుకు చెందిన టీడీపీ నేతలు నిమిషాల వ్యవధిలోనే పోలీస్స్టేషన్ ముందు వాలిపోయారు. అయితే టీడీపీ నేతలు దొంగల ముఠాకు, రోడ్డు ప్రమాదానికి కారణమైన నిందితులకు కొమ్మ కాస్తున్నారని ప్రచారం జరగడంతో ఎవరికి వారు సైలెంట్ అయిపోయారు.
తండ్రిని కోల్పోయిన బిడ్డలను ఆదుకోవాలి
టీడీపీకి చెందిన దొంగల ముఠా చేసిన రోడ్డు ప్రమాదంలో తండ్రిని కోల్పోయిన సుధీర్బాబు బిడ్డల భవిష్యత్ అగమ్యగోచరంగా మారింది. తల్లి గృహిణిగా ఉండగా, నాన్నమ్మ అంగన్వాడీ వర్కర్గా పనిచేస్తుండగా అరకొర వేతనం వస్తోంది. ఆమె కూడా మరో రెండు నెలల్లో ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఆ తర్వాత ఆ కుటుంబం బతుకుదెరువు పరిస్థితి ఏమిటని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ చిన్నారులను ప్రభుత్వమే ఆదుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
రైతు పొలంలో మోటార్లు అంటూ..
రోడ్డు ప్రమాదానికి కారణమై పట్టుబడిన వాహనంలో చోరీ చేసిన మోటారు ఉండడంతో మరో కట్టుకథ అల్లారు. జమ్మిపాళెం సమీపంలో ఓ రైతు పొలాన్ని కౌలుకు తీసుకుని వేరుశనగ సాగు చేస్తున్నామని, మోటారు రిపేరు కావడంతో తీసుకెళ్తున్నామంటూ బుకాయించే ప్రయత్నం చేశారు. సదరు రైతును అదే విషయాన్ని చెప్పాలని ఒత్తిడి చేశారు. వాస్తవానికి నిందితులు జగనన్న కాలనీలోని తాగునీటి పథకం మోటారు చోరీ చేయడం, దీనికి సంబంధించి సమాచారం ఉండడంతో టీడీపీ నేతలు చెప్పినట్లు చెబితే చివరకు తన మెడకు చుట్టుకుంటుందని భావించిన సదరు రైతు అసలు విషయాన్ని పోలీసులకు చెప్పేశాడు. ఈ క్రమంలో పబ్లిక్ హెల్త్, మున్సిపల్ ఇంజినీరింగ్ శాఖ ఏఈ ఏకాంబరం కోవూరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితులపై మంగళవారం రాత్రి ఎట్టకేలకు చోరీ కేసు కూడా నమోదు చేశారు.

మృతుడు సుధీర్ బాబు కూమారులు