సర్వేపల్లి మాఫియాల అడ్డా | - | Sakshi
Sakshi News home page

సర్వేపల్లి మాఫియాల అడ్డా

Jun 26 2025 1:40 PM | Updated on Jun 26 2025 1:47 PM

Gravel Excavations

పొదలకూరు, వెంకటాచలంలో విచ్చలవిడిగా గ్రావెల్‌ తవ్వకాలు

ముఖ్యనేత కనుసన్నల్లోనే చెలరేగుతున్న నేతలు

ట్రిప్పు రూ.5 వేల నుంచి రూ.10 వేలు

సాగరమాల ప్రాజెక్ట్‌ పేరుతో తరలిస్తున్న వైనం

పట్టించుకోని మైనింగ్‌, రెవెన్యూ అధికారులు

సర్వేపల్లి.. సహజ వనరుల సంపద దోపిడీ మాఫియాలకు అడ్డాగా మారింది. అధికారం చేజిక్కించుకున్నప్పటి నుంచి ఏడాది కాలంగా విరామం లేకుండా ఇసుక, మట్టి, గ్రావెల్‌ తవ్వకాలతో జిల్లాలోనే చరిత్ర సృష్టిస్తున్న ముఖ్య నేత కనుసన్నల్లో తాజాగా వైట్‌ క్వార్ట్‌ ్జ తవ్వకాలను గిన్నిస్‌ రికార్డు స్థాయిలో చేపడుతున్నారు.

పొదలకూరు, వెంకటాచలంలో విచ్చలవిడిగా గ్రావెల్‌ తవ్వకాలు చేపడుతున్నా.. అధికారయంత్రాంగం ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తోంది. అక్రమంగా మైనింగ్‌, గ్రావెల్‌ తవ్వకాలు చేశారంటూ చేయని నేరాలకు మాజీమంత్రి కాకాణిపై తప్పుడు కేసులు పెట్టి జైల్లోపెట్టించి పైశాచికానందం పొందుతున్న టీడీపీ నేతలు వీరు సాగిస్తున్న ప్రకృతి సంపద దోపిడీకి ఎంత కాలం జైల్లో పెట్టాలని ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.

సాక్షి టాస్క్‌ఫార్స్‌: సర్వేపల్లి ముఖ్యనేత నిత్యం మాట్లాడేవి నీతులు.. చేసేవి అవినీతి పనులు అన్నట్లుగా ఉంది. నియోజకవర్గాన్ని ఇసుక, మట్టి, గ్రావెల్‌ మాఫియాలకు అడ్డాగా మార్చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆయా సహజ వనరుల దోపిడీలో అధికార పార్టీ నేతలు ఒక ఉద్యమంగా సాగిస్తున్నారు. పొదలకూరు, వెంకటాచలం మండలాల్లో ప్రభుత్వ భూముల్లో ఎలాంటి అనుమతులు లేకుండా విచ్చలవిడిగా అక్రమంగా గ్రావెల్‌, మట్టిని తవ్వేసి తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఒక్క గ్రావెల్‌ మాఫియా రూ.కోట్ల గ్రావెల్‌ దందా సాగిస్తోందంటే ఏ స్థాయిలో జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. ఇంత జరుగుతున్నా.. మైనింగ్‌, రెవెన్యూ అధికారులు అటు వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ముఖ్యనేత కనుసన్నల్లో గ్రావెల్‌ మాఫియా చెలరేగిపోతోంది. అడ్డుకునేందుకు ప్రయత్నించే వారిపై అక్రమ కేసుల పేరుతో భయపెడుతుండడంతో కనీసం ఫిర్యాదులు చేసేందుకు ముందుకు రావడం లేదు.

నిత్యం వందల ట్రిప్పుల తరలింపు

సర్వేపల్లి నియోజకవర్గంలో పొదలకూరు, వెంకటాచలంలో నిత్యం నిరంతరాయంగా వందల ట్రిప్పుల గ్రావెల్‌ను తరలిస్తున్నారు. ఒక్కో ట్రిప్పు డిమాండ్‌ను బట్టి రూ.5 వేల నుంచి రూ.10 వేలు కూడా వసూలు చేస్తున్నారు. ముత్తుకూరు మండలంలో చేపడుతున్న సాగరమాల ప్రాజెక్ట్‌కు గ్రావెల్‌ అవసరం కావడంతో కొన్ని నెలలుగా వెంకటాచలం, పొదలకూరు మండలాల నుంచి నిత్యం సుమారు 200 ట్రిప్పులకుపైగానే గ్రావెల్‌ను తరలిస్తున్నారు. జోరు వర్షం కురిస్తే తప్పించి మిగిలిన రోజుల్లో పట్టపగలే యంత్రాలతో టిప్పర్లు పెట్టి గ్రావెల్‌, మట్టిని దోచుకుంటున్నారు. ప్రధానంగా వెంకటాచలం మండలం నాగబొట్లకండ్రిక గ్రామం నుంచి గ్రావెల్‌ తరలిస్తున్నారు.

తాటిపర్తిలో 130 ఎకరాల్లో..

పొదలకూరు మండలం తాటిపర్తి పంచాయతీ బత్తులపల్లిపాటు గ్రామంలో సర్వే నంబరు 26లో సుమారు 130 ఎకరాల ప్రభుత్వ, మేతపొరంబోకు భూములు ఉన్నాయి. తాటిపర్తికు చెందిన టీడీపీ నేతలు ఆ భూముల్లో రేయింబవళ్లు గ్రావెల్‌ను తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. యథేచ్ఛగా యంత్రాలను ఉపయోగించి పెద్ద గోతులను చేసి గ్రావెల్‌ను నెల్లూరుతోపాటు చుట్టు పక్కల లేఅవుట్లకు తరలిస్తున్నారు. స్థానిక రెవెన్యూ అధికారులు ప్రశ్నిస్తే అధికారం పార్టీలో ఉన్నాము.. చూసీచూడనట్లు పోవాల్సిందేనని బెదిరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ నుంచి నిత్యం 100 ట్రిప్పుల వరకు తరలిస్తున్నట్లు సమాచారం. గ్రావెల్‌ దోపిడీపై అడిగే వారిపై అక్రమ కేసులు బనాయిస్తామని బెదిరింపులకు దిగుతున్నారనే విమర్శలు ఉన్నాయి. గతంలో ఈ పంచాయతీలో ఇంటి అవసరాల కోసం సామాన్యులు రెండు ట్రాక్టర్లు గ్రావెల్‌ తోలుకుంటే పోలీసులకు పట్టించి కేసులు పెట్టించారు. ఇప్పుడు అధికారాన్ని అడ్డుపెట్టుకుని చెలరేగిపోతున్నారు.

వైఎస్సార్‌సీపీ హయాంలో ఏ తప్పు లేకపోయినా..

గతంలో వైఎస్సార్‌సీపీ పాలనలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఏ నేత కూడా సహజ వనరుల అక్రమ దందాలకు పాల్పడలేదు. అయినా తాటిపర్తి పంచాయతీలో రుస్తుం మైన్‌లో అక్రమంగా మైనింగ్‌ చేయించారంటూ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డిపై తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టించారు. బెయిల్‌ రాకుండా అడ్డుకునేందుకు తాజాగా సర్వేపల్లి రిజర్వాయర్‌లో అక్రమంగా గ్రావెల్‌ తవ్వారని మరో కేసు నమోదు చేయించారు. ఆ కేసుకు సంబంధించి కాకాణిని పోలీసు కస్టడీకి తీసుకుని విచారణ చేస్తున్నారు. వాస్తవంగా సర్వేపల్లి నియోజకవర్గంలో అక్రమంగా గ్రావెల్‌, మట్టి, మైనింగ్‌ జరిగి ఉంటే అధికార పార్టీ సదరు ముఖ్య నేత వీరంగం చేసేవారు. ట్రాక్టర్‌ గ్రావెల్‌ తరలించినా.. తట్టెడు మట్టి తవ్వినా మైనింగ్‌ శాఖ అనుమతుల మేరకే తవ్వడంతో ఎక్కడా అక్రమ దందాలు చేసినట్లు ఆధారాలు లేకపోవడంతో మౌనంగా ఉండిపోయారు. అధికారం రాగానే అక్రమాలు జరగకపోయినా.. అక్రమాలు చేశారంటూ ఊదరగొట్టుతున్నారు.

చెప్పేవి నీతులు.. చేసేవి అవినీతి పనులు

గతంలో ప్రతిపక్షంలో ఉండీ అక్రమంగా గ్రావెల్‌ తరలిస్తుండడంతో పోలీసులు అడ్డుకుని వాహనాలను స్టేషన్‌కు తరలిస్తే.. సదరు ముఖ్య నేత సాగించిన హడావుడి అంతాఇంతా కాదు. నిత్యం మీడియా ముందుకు వచ్చి తానేదో సత్యహరిశ్చంద్రుడు వారసుడైనట్లు.. నీతులు మాట్లాడుతుంటారు. కానీ చేసేవన్నీ అవినీతి పనులే. సదరు నేత అధికారం దక్కిన ఏడాది కాలంగా ఇసుక, మట్టి, గ్రావెల్‌, బూడిద, మద్యం, పేకాట, డైమండ్‌ డబ్బా వంటి మాఫియాలను బహిరంగంగా నడిపిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యనేత మండలానికొక నేతను పెట్టుకుని ఏడాది కాలంలో రూ.వందల కోట్లు కొల్లగొట్టినట్లు అధికార పార్టీలోనే చర్చ జరుగుతోంది. ఆ ముఖ్య నేత అక్రమాలను ఏడాది కాలంగా స్థానిక మాజీ ఎమ్మెల్యే, మాజీమంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి పక్కా ఆధారాలతో మీడియా సమావేశాల్లో బట్టబయలు చేస్తూ వచ్చారు. దీన్ని జీర్ణించుకోలేక కాకాణిపై తప్పుడు కేసులు పెట్టించి జైల్లో కూర్చొబెట్టి తన అవినీతి, అక్రమాలను విచ్చలవిడిగా సాగిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement