
ఉపాధి పనులు వద్దని..
ఆత్మకూరు: పెన్నానదిలో ఇసుక రీచ్లను జూన్ 1వ తేదీ నుంచి రెండు నెలల పాటు మూసివేయాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలిచ్చిన విషయం తెలిసిందే. అయినా ఎక్కడా ఈ ఆదేశాలు అమలు చేయడం లేదు. మిగతా చోట్ల పగలు ఇసుక తవ్వకాలు ఆపేసి రాత్రి పూట చాటుమాటుగా చేపడుతుంటే.. ఆత్మకూరు మండలంలోని అప్పారావుపాళెం వద్ద పెన్నానది ఇసుక రీచ్ రాత్రింబవళ్లు విచ్చలవిడిగా తవ్వేస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు రీచ్లను మూసివేయకపోవడంతో ‘సాక్షి’లో వచ్చిన కథనానికి స్పందించిన ఆర్డీఓ బి.పావని ఆదేశాలతో తహసీల్దారు రీచ్ని మూయించి వేశారు. కేవలం రెండు రోజులు మాత్రమే మూసేసిన ఈ రీచ్లో శనివారం నుంచి యథేచ్ఛగా ట్రాక్టర్ల ద్వారా ఆత్మకూరు, పొదలకూరు, చేజర్ల మండలాలకు తరలిస్తున్నారు. అధికారుల ఆదేశాలతో ఓ వీఆర్ఓను అక్కడ కాపలా ఉంచి రీచ్లోకి వెళ్లకుండా తాళం సైతం వేశారు. అయితే టీడీపీ నాయకుల ప్రమేయంతో స్థానికులు తాళాలు పగులగొట్టి వీఆర్ఓను అక్కడి నుంచి పంపివేసి దౌర్జన్యంగా ఇసుకను తరలిస్తున్నారు. రీచ్లోకి వాహనాలు వెళ్లకుండా జేసీబీతో లోతుగా గాడి తీయాలని అధికారులు పంపగా స్థానికులు అడ్డుకొని రీచ్లోకి దారికి గండి కొట్టకుండా ఆ వాహనాన్ని వెనక్కి పంపివేశారు.
విలేకరులకు బెదిరింపులు
ప్రభుత్వం మాదే.. ఇసుక రీచ్లో పెత్తనమంతా మాదేనంటూ స్థానిక టీడీపీ నేతలు కొందరు యువకులను చేరదీసి ఇసుక రీచ్లో హవా కొనసాగిస్తున్నారు. గ్రామంలో యంత్రాల ద్వారా ఇసుక లోడ్ చేయడం లేదని కేవలం మనుషులే ఉపాధి కోసం ఇసుక లోడ్ చేస్తున్నారని చెబుతూ, తమకు ప్రత్యేకమైన అనుమతి ఉందని పేర్కొనడం గమనార్హం. ఈ విషయంలో ఎవరు జోక్యం చేసుకున్నా తీవ్ర పరిణామాలు ఉంటాయని విలేకరులను సైతం ఇష్టారాజ్యంగా వార్తలు రాస్తే సహించేది లేదని ఫోన్ల ద్వారా బెదిరిస్తున్నారు. స్థానిక టీడీపీ నేతల అండ చూసుకుని యువకులు సైతం కథనాలు రాసిన వారిపై కేసు నమోదు చేయాలని ఆత్మకూరు పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం. గ్రామంలోకి వస్తే విలేకరుల అంతు చూస్తామని వారు బాహాటంగానే అంటున్నారంటే అక్కడి పరిస్థితి అర్థమవుతుంది. శనివారం నుంచి పూర్తిస్థాయిలో ఇసుకను తరలిస్తున్న ఈ రీచ్లో సుమారు 50 నుంచి 70కిపైగా ట్రాక్టర్లు లోడ్ చేసుకొని యథేచ్ఛగా సాగుతున్నాయి.
ఇసుక లోడింగ్ ద్వారా ఉపాధి పొందుతూ కుటుంబాలను పోషించుకుంటున్న వారికి ప్రత్యామ్నాయంగా ఉపాధి హామీ పథకం ద్వారా పనులు కల్పించేందుకు అధికారులను మూడు రోజుల క్రితం గ్రామానికి పంపించారు. అందరికీ జాబ్కార్డులు ఇచ్చి పనులను కల్పించాలని ఉపాధి కోల్పోకుండా చూడాలని ఆదేశించారు. దీంతో ఉపాధి హామీ పథకం సిబ్బంది గ్రామానికి వెళ్లారు. అయితే అక్కడ ఓ వర్గం ఉపాధి పనులు మాకు వద్దని ఇన్నాళ్లు గ్రామానికి ఎందుకు రాలేదని ఇప్పుడెందుకు వచ్చారని వారిని దుర్భాషలాడి తరిమేశారు. గతంలోనూ ఉపాధి పనులు చేసుకోవాలని తాము సూచించామని, ఇసుక రీచ్ ఉందని ఎప్పుడు ఈ పనులు ఉంటాయని, ఉపాధి పనులు అవసరం లేదని గ్రామస్తులు చెప్పడాన్ని ఎన్ఆర్ఈజీఎస్ సిబ్బంది గుర్తు చేశారు. కాలనీలోని కొందరు టీడీపీ నాయకుల అండతో ఇసుక రీచ్నే పరమావధిగా చేసుకొని అక్రమంగా ఇసుక తరలిస్తున్నారు.