
డీఈఓ ఆఫీసు ముందు ఏపీటీఎఫ్ నిరసన
● ఎస్ఏ బదిలీల్లో
అవకతవకలు జరిగాయని ఆరోపణ
నెల్లూరు (టౌన్): ఉపాధ్యాయ బదిలీల్లో భాగంగా స్కూల్ అసిస్టెంట్లు వెబ్ ఆప్షన్లలో అవకతవకలు చోటు చేసుకున్నాయంటూ ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో డీఈఓ కార్యాలయం ముందు పలువురు ఉపాధ్యాయులు శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షులు సురేంద్రరెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియ తొలుత నుంచి ఒక ప్రహసనంగా మారిందన్నారు. తాజాగా విడుదల చేసిన బదిలీ ఉత్తర్వుల్లో సీనియర్ టీచర్లకు అన్యాయం జరిగిందన్నారు. ఎక్కువ పాయింట్లు వచ్చిన ఉపాధ్యాయులకు దూర ప్రాంతాలు, తక్కువ పాయింట్లు వచ్చిన వారికి దగ్గర్లో ఉన్న క్లస్టర్ వేకెన్సీలు కేటాయిండం దుర్మార్గపు చర్యన్నారు. స్కూల్ అసిస్టెంట్లకు పీఎస్ హెచ్ఎం పోస్టులు మాదిరి క్లస్టర్ పోస్టులకు విల్లింగ్ ఇచ్చి ఆప్షన్లు పెట్టుకున్న వారికి క్టస్టర్ వేకెన్సీలు కేటాయించి వుంటే బాగుండేదన్నారు. ప్రిఫరెన్షియల్ కేటగిరీలో ఉన్న ఉపాధ్యాయులకు జనరల్లోకి వచ్చి ఆప్షన్లు పెట్టుకునే అవకాశం ఉన్నా వారికి ప్రిఫరెన్షియల్ స్ధానాలు మాత్రమే కేటాయించారన్నారు. స్కూల్ అసిస్టెంట్ల బదిలీల్లో జరిగిన అవకతవకలు రివైజ్ చేసి సీనియర్ టీచర్లకు న్యాయం చేయాలన్నారు. ఎస్జీటీలకు వెబ్ ఆప్షన్లకు స్వస్తి చెప్పి మాన్యువల్ కౌన్సెలింగ్ నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పిచ్చిబాబు, నాయకులు ఆలీ, రియాజ్, వెంకటేశ్వర్లురెడ్డి, గురవయ్య, రామ్మోహన్రెడ్డి, శ్రీనివాసులు పాల్గొన్నారు.