
ఆన్లైన్ ద్వారా లీగల్ మెట్రాలజీ సేవలు
● రీజినల్ జాయింట్ కంట్రోలర్ మాధురి
నెల్లూరు(అర్బన్): లీగల్ మెట్రాలజీ (తూనికలు, కొలతలు) శాఖకు సంబంధించిన సేవలన్నీ ఆన్లైన్ ద్వారానే నిర్వహించాలని ఆ శాఖ జాయింట్ కంట్రోలర్ ఎంఎన్ఎస్ మాధురి తెలిపారు. మంగళవారం నెల్లూరు, బాపట్ల, ఒంగోలుకు చెందిన పలువురు ఎంటర్ ప్రెన్యూర్లతో నగరంలోని ఐఎంఏ హాల్లో సమావేశాన్ని నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ లీగల్ మెట్రాలజీకి సంబంధించిన అన్ని రకాల సేవలను ఏపీ ఇండస్ట్రియల్ పోర్టల్ డిపార్ట్మెంట్ నుంచి ఉపయోగించుకోవాలన్నారు. లీగల్ మెట్రాలజీకి ప్రత్యేకించి వెబ్సైట్ లేకపోవడంతో ఇండస్ట్రియల్ పోర్టల్ను వినియోగించుకోవాలన్నారు. అధికారులు సింగిల్ డెస్క్ విధానంలో అనుమతులు మంజూరు చేయాలని కోరారు. కాటాలకు సంబందించి లోపాలున్న చోట మరమ్మతులు చేయించి స్టాంపింగ్ చేయాలన్నారు. పాన్ కార్డు, ఆధార్ కార్డుల వివరాలు కూడా ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. పారదర్శకత కోసం పక్కాగా వివరాలు నమోదు చేయాలన్నారు. అన్ని పరిశీలించి అనుమతులు మంజూరు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం, నెల్లూరు జిల్లాల డిప్యూటీ కంట్రోలర్ ఐజాక్, అసిస్టెంట్ కంట్రోలర్ ఈశ్వరరావు, ఇన్స్పెక్టర్ రియాజ్ తదితరులు పాల్గొన్నారు.