
ఏఆర్ కానిస్టేబుల్ అనుమానాస్పద మృతి
● పెన్నానదిలో మృతదేహం లభ్యం
నెల్లూరు సిటీ: నెల్లూరు రూరల్ మండలం పొట్టేపాళెం వద్ద పెన్నానదిలో ఏఆర్ కానిస్టేబుల్ అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. ఈ ఘటన శనివారం సాయంత్రం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు ఇందుకూరుపేట మండలం పల్లిపాడు గ్రామానికి చెందిన కె రమేష్బాబు 2012 బ్యాచ్ ఏఆర్ స్పెషల్ పార్టీ కానిస్టేబుల్. 2016లో రేపల్లికు చెందిన వాణితో వివాహం అయింది. దంపతులకు 8 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. ఈ క్రమంలో కొంతకాలంగా భార్యాభర్తల మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. దీంతో వాణి రేపల్లిలోని తల్లి ఇంట్లో ఉంటోంది. మే 28 సాయంత్రం నుంచి రమేష్బాబు ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు పలు ప్రాంతాల్లో వెతికారు. అయినప్పటికీ అతని ఆచూకీ లభించలేదు. శనివారం సాయంత్రం పొట్టేపాళెం గ్రామంలోని పెన్నానదిలో రమేష్బాబు మృతదేహం తేలియాడుతూ కనిపించింది. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. రమేష్బాబు దుస్తులు, వాచ్ ఇతర వస్తువులు పెన్నానది ఒడ్డున ఉండడాన్ని గుర్తించారు. అతను నదిలో ఈతకు వెళ్లి మునిగాడో... లేక ప్రమాదవశాత్తు పడి మృతిచెందాడో.. మరి ఇంకేమన్నా కారణాలు ఉన్నాయో తెలియలేదు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రూరల్ పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.