
హైవేపై ఆయిల్ ట్యాంకర్ బోల్తా
● తగులబడిన మరో ట్యాంకర్
మర్రిపాడు: మండలంలోని కండ్రిక సమీపంలో నెల్లూరు – ముంబై జాతీయ రహదారి బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. నెల్లూరు నుంచి ప్రొద్దుటూరు వైపు వెళ్తున్న ఆయిల్ ట్యాంకర్ కండ్రిక సమీపంలో బోల్తా పడింది. వెనుకనే వస్తున్న సిమెంట్ ట్యాంకర్ డ్రైవర్ ప్రమాదాన్ని చూశాడు. వాహనాన్ని ఆపి ఘటనా స్థలానికి వెళ్లాడు. ఈ క్రమంలో మరో సిమెంట్ ట్యాంకర్ ఆగి ఉన్న ట్యాంకర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఢీకొన్న ట్యాంకర్ కాలిపోయింది. మొత్తంగా ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న మర్రిపాడు పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైర్ సిబ్బంది మంటల్ని ఆర్పివేయడంతో పెను ప్రమాదం తప్పింది. క్షతగాత్రులను ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.