
చౌటుప్పల్లో ఘోర రోడ్డు ప్రమాదం
చౌటుప్పల్ రూరల్: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ఖైతాపురం గ్రామ స్టేజీ సమీపంలో హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. నెల్లూరు జిల్లా కందుకూరు నుంచి శివాంజలి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు 34 మంది ప్రయాణికులతో మంగళవారం రాత్రి హైదరాబాద్కు బయలుదేరింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ఖైతాపురం గ్రామ సమీపంలోకి వచ్చే సరికి జాతీయ రహదారి పక్కన ఆగి ఉన్నట్రాలీ లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం నుజ్జునుజ్జయింది. ప్రకాశం జిల్లా జిరుగుమల్లి మండలం చిర్రిపాడు గ్రామానికి చెందిన డ్రైవర్ కొండల్రావు (42) బస్సు క్యాబిన్లో ఇరుక్కుపోయి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతిచెందాడు. డ్రైవర్ వెనుక సీటులో కూర్చున్న ప్రకాశం జిల్లా పొన్నులూరు మండలం పరుచూరివారిపాళెం గ్రామానికి చెందిన దండిబోమిన గోవిందమ్మ (47)కు తీవ్రగాయాలు కాగా చికిత్స నిమిత్తం హైదరాబాద్కు తరలిస్తుండగా మృతిచెందింది. ప్రయాణికుల్లో 18 మందికి గాయాలయ్యా యి. వారిలో కందుకూరుకు చెందిన యనమల మమత, లింగసముద్రం మండలం తూమగుంట గ్రామానికి చెందిన మీటినేని విజయ, ఉలవపాడు మండలం రామాయపట్నానికి చెందిన అప్పనగిరి సురేష్, అప్పనగిరి జ్యోతి ఉన్నారు. బస్సు ప్రమాద సమయంలో డ్రైవర్ నిద్రమత్తులో ఉన్నాడని ప్రాథమికంగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.
ఆగి ఉన్న లారీని వెనుక నుంచి
ఢీకొట్టిన ప్రైవేట్ ట్రావెల్ బస్సు
గాయపడిన వారిలో జిల్లా వాసులు