
ఉద్యోగులకు సేవలందించేందుకు సిద్ధం
● రాష్ట్ర ప్రిన్సిపల్ అకౌంటెంట్
జనరల్ శాంతిప్రియ
నెల్లూరు రూరల్: పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు సేవలందించేందుకు ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ కార్యాలయం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని రాష్ట్ర ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ శాంతిప్రియ తెలిపారు. బుధవారం నెల్లూరులోని కస్తూర్బా కళాక్షేత్రంలో ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్, జీపీఎఫ్ సమస్యల సత్వర పరిష్కారానికి ప్రత్యేక అదాలత్ నిర్వహించారు. 55 మందికి పెన్షన్ మంజూరు పత్రాలు, 15 మందికి జీపీఎఫ్ ఆథరైజేషన్ లేఖలను నేరుగా అందజేశారు. ఈ సందర్భంగా శాంతిప్రియ మాట్లాడుతూ ప్రతి ప్రభుత్వ ఉద్యోగి తమ పెన్షన్ ప్రతిపాదనల మంజూరు ప్రక్రియ ఏజీ కార్యాలయంలో ఏవిధంగా జరుగుతుందో తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతిపాదనలను పంపే సమయంలో దరఖాస్తుతోపాటు ఏ పత్రాలను జతపరచాలో విధిగా తెలుసుకోవాలన్నారు. వచ్చే నెల నుంచి విద్యాశాఖతో మొదలుపెట్టి క్రమంగా అన్ని శాఖల్లోని ఉద్యోగులకు ఎలక్ట్రానిక్ పద్ధతిలోనే పీపీఓలను అందజేస్తామన్నారు. ఇందుకోసం ప్రతి ఉద్యోగి నేరుగా తానే ఆన్లైన్లో దరఖాస్తును పూరించి అవసరమైన పత్రాలను జతచేసి డీడీఓలకు సమర్పించాల్సి ఉంటుందన్నారు. రాష్ట్ర ట్రెజరీ శాఖ డైరెక్టర్ మోహన్రావు మాట్లాడుతూ 30 ఏళ్లకు పైగా ప్రభుత్వ సర్వీస్ పూర్తి చేసి పెన్షన్ మంజూరు కోసం రాష్ట్ర కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఏజీ కార్యాలయం వారు నేరుగా జిల్లాలకు కదిలి రావడం ఉద్యోగుల అదృష్టమన్నారు. డీఆర్వో ఉదయభాస్కర్ మాట్లాడుతూ పెన్షన్ ప్రతిపాదనలను పంపే సమయంలో ఎటువంటి తప్పులు లేకుండా చూసుకోవాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ అకౌంటెంట్ జనరల్ కిశోర్రెడ్డి, వారి కార్యాలయ అధికారులు విజయ్కుమార్, భవాని ప్రసాద్, సునీత, కార్యక్రమ నోడల్ అధికారి, డీటీఓ గంగాద్రి, డీసీఓ గురప్ప, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ వెంకటరమణ, జిల్లా సైనిక సంక్షేమాధికారి హరికష్ణ, డీపీఆర్ఓ సదారావు తదితరులు పాల్గొన్నారు.
గుర్తుతెలియని
వృద్ధుడి మృతి
నెల్లూరు(క్రైమ్): నెల్లూరు తిక్కన పార్కు సమీపంలోని జాఫర్సాహెబ్ కాలువ వద్ద గుర్తుతెలియని వృద్ధుడి మృతదేహాన్ని బుధవారం స్థానికులు గుర్తించి నెల్లూరు సంతపేట పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై బాలకృష్ణ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు. చనిపోయి రెండు, మూడు రోజులై ఉండొచ్చని తెలుస్తోంది. మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీకి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
జూదరుల అరెస్ట్
అనుమసముద్రంపేట: మండలంలోని జువ్వలగుంటపల్లిలో పేకాట ఆడుతున్న జూదరులను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై సైదులు గురువారం తెలిపారు. ఆరుగురు జూదరులను పట్టుకున్నామన్నారు. రూ.1,60,890ల నగదు, ఐదు సెల్ఫోన్లు, ఒక బైక్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కేసు నమోదు చేసినట్లు వివరించారు.
ముదురుతున్న
కుల సర్టిఫికెట్ వివాదం
కలువాయి(సైదాపురం): కలువాయి మండలంలో కులం సర్టిఫికెట్ మంజూరులో నెలకొన్న వివాదం ముదురుతోంది. ఇటీవల స్థలం విషయమై రెండు వర్గాల మధ్య జరిగిన గొడవలో ఇరువురిపై పోలీస్స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. రెండు వర్గాలకు చెందిన వారు కుల ధ్రువీకరణ పత్రం కోసం దరఖాస్తు చేసుకోగా వారికి సర్టిఫికెట్ల మంజూరులో రెవెన్యూ అధికారులు జాప్యం చేశారు. ఈ క్రమంలో ఓ వర్గం వారు నెల్లూరు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు ఆ వర్గం వారికి కుల ధ్రువీకరణ పత్రం మంజూరు చేశారు. మరో వర్గానికి చెందిన వారు బుధవారం టీడీపీ నేతలతో కలిసి రెవెన్యూ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. తమకు ఎందుకు స ర్టిఫికెట్ మంజూరు చేయలేదో చెప్పాలని తహసీల్దార్ శ్యామ్సుందర్ను నిలదీశారు.
ఆర్టీసీ డిపోలో పరిశీలన
వెంకటగిరి రూరల్ : వెంకటగిరి పట్టణంలోని ఆర్టీసీ డిపో, ఆర్టీసీ బస్టాండ్ను బుధవారం రీజినల్ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్రెడ్డి పరిశీలించారు. గ్యారేజీనీ పరిశీలించి సిబ్బందితో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ డిపో, బస్టాండ్ను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. బస్టాండ్ను ఆధునికీకరించి మొక్కలు నాటాలని సూచించారు. సిబ్బంది సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే మూతపడిన డక్కిలి బస్టాండ్ను, వినియోగంలో లేని బాలాయపల్లి బస్టాండ్ను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు.