
పకడ్బందీగా మెగా డీఎస్సీ పరీక్షలు
నెల్లూరు రూరల్: జిల్లాలో మెగా డీఎస్సీ – 2025 పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని డీఆర్వో ఉదయభాస్కర్రావు సంబంధిత అధికారులకు ఆదేశించారు. బుధవారం నెల్లూరు కలెక్టరేట్లోని తన కార్యాలయంలో పరీక్షల నిర్వహణపై సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఈనెల 6 నుంచి 30వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. ఉమ్మడి జిల్లాలో 8 కేంద్రాల్లో 31,221మంది అభ్యర్థులు హాజరుకానున్నట్లు చెప్పారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేసి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీస్ అధికారులకు సూచించారు. వైద్యశిబిరాలను పెట్టాలని వైద్యారోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కేంద్రాలకు అభ్యర్థులు సమయానికి చేరుకునేలా బస్సులను నడపాలని ఆర్టీసీ అధికారులకు చెప్పారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రశాంత వాతావరణంలో పరీక్షలను నిర్వహించాలన్నారు.
హెల్ప్డెస్క్ ఏర్పాటు
డీఎస్సీ పరీక్షలకు సంబంధించి అభ్యర్థులకు సందేహాలుంటే 62817 04160, 81219 47387, 81250 46997, 93988 10958, 79956 49286, 79957 89286, 99630 69286, 70138 37359 ఫోన్ నంబర్లను సంప్రదించాలని డీఈఓ బాలాజీరావు తెలిపారు. నెల్లూరు రూరల్ మండలం పొట్టేపాళెం వద్ద గల డిజిటల్ జోన్, కోవూరు మండలం గంగవరంలోని గీతాంజలి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కావలిలోని పీబీఆర్ విశ్వోదయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్, కావలిలోని రామిరెడ్డి సుబ్బరామిరెడ్డి ఇంజినీరింగ్ కళాశాల, నెల్లూరు నగరంలోని ముత్తుకూరు రోడ్డులో ఉన్న నారాయణ ఇంజినీరింగ్ కళాశాల, తిరుపతి జిల్లా పరిధిలో ఉన్న విద్యానగర్లో ఉన్న ఎన్బీకేఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, టెక్నాలజీ, ఎన్బీకేఆర్ సైన్స్, ఆర్ట్స్ కళాశాలలు, గూడూరు సమీపంలోని ఆదిశంకర ఇంజినీరింగ్ కళాశాలల్లో పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. కేంద్రాల్లోకి సెల్ఫోన్లు, స్మార్ట్ వాచ్లు, ఎలక్ట్రానిక్ పరికరాలను అమనుతించరని చెప్పారు. నిర్దిష్ట సమయానికి కంటే గంట ముందు అభ్యర్థులను లోనికి అనుమతిస్తామని, నిబంధనలు తప్పకుండా పాటించాలని సూచించారు. సమావేశంలో విద్యుత్, వైద్యం, పోలీస్, ఆర్టీసీ శాఖల అధికారులు పాల్గొన్నారు.
8 కేంద్రాల ఏర్పాటు
31,221 మంది అభ్యర్థులు
సెల్ఫోన్లు, స్మార్ట్ వాచ్లు, ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదు
జిల్లా రెవెన్యూ అధికారి
ఉదయభాస్కర్రావు