
వెన్నుపోటు దినం విజయవంతం చేద్దాం
● మాజీ మంత్రి ప్రసన్నకుమార్ రెడ్డి
● పోస్టర్ ఆవిష్కరణ
కోవూరు: కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడిచినా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా వారికి వెన్నుపోటు పొడిచిందని, ఇందుకు నిరసనగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు జూన్ 4న నిర్వహించనున్న నిరసన ర్యాలీని కోవూరు నియోజకవర్గంలో విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా ముందుకు రావాలని మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. కోవూరులోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో శనివారం వెన్నుపోటు దినం పోస్టర్ను నాయకులు, ప్రజాప్రతినిధులతో కలసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రసన్నకుమార్రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రజల సంక్షేమాన్ని ఏ మాత్రం పట్టించుకోని దుర్మార్గమైన పాలన చేస్తున్నారని పేర్కొన్నారు. జూన్ 4న ఉదయం 9 గంటలకు స్థానిక బజారు సెంటర్ నుండి ప్రారంభించి ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ వరకు నిరసన ర్యాలీ నిర్వహిస్తామని తెలిపారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల కన్వీనర్లు, అనుబంధనంఘాల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజాప్రతినిధులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని పేర్కొన్నారు.
ఇటీవల కోవూరులో తాను 2029లో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి మళ్లీ గద్దె నెక్కుతారని మాట్లాడానని, ప్రధాని నరేంద్రమోడి ఒప్పుకుంటే బీజేపీతో కలసి ముందుకు పోతామని నా వ్యక్తిగత అభిప్రాయాన్ని వెల్లడించానని తెలిపారు. అయితే కొన్ని ఛానెళ్లు దీనిని వక్రీకరించి ప్రసన్నకుమార్రెడ్డి జగన్కు ఝలక్ ఇచ్చాడని చెప్పాయని, నేను మాత్రం కడ వరకు జగన్తోనే కలిసి నడుస్తానని పేర్కొన్నారు. నాకు గతంలో మంత్రి పదవి ఇవ్వకపోయినా నేను మాట్లాడలేదని, కాకాణి గోవర్ధన్రెడ్డికి, అనిల్కుమార్ యాదవ్కి ఇచ్చారని సంతోషించానన్నారు. మంత్రి పదవి కన్నా ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి నాకు సహకారం అందించి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశారన్నారు. ఈ కార్యక్రమంలో నల్లపరెడ్డి రజత్కుమార్రెడ్డి, నాయకులు వీరి చలపతి, పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి, మండల కన్వీనర్లు అనూప్రెడ్డి, మావులూరు శ్రీనివాసులురెడ్డి, శేషగిరిరావు, నవీన్కుమార్రెడ్డి, సతీష్రెడ్డి, షాహుల్, దినేష్రెడ్డి, మల్లికార్జున్రెడ్డి, మీరారెడ్డి పాల్గొన్నారు.