
అన్ని మండలాల్లో యోగా పోటీలు
● ఇన్చార్జి కలెక్టర్ కార్తీక్
నెల్లూరు రూరల్: మండల స్థాయి యోగా పోటీలను ఈ వారాంతం లోగా పూర్తి చేయాలని ఇన్చార్జి కలెక్టర్ కె.కార్తీక్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన యోగాంధ్ర కార్యక్రమాలపై జిల్లా అధికారులు, ఎంపీడీఓలు మున్సిపల్ కమిషనర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ గ్రామస్థాయిలో యోగా పోటీలు పూర్తయ్యాయని, అక్కడి విజేతలకు మండల స్థాయిలో పోటీలు నిర్వహించి విజేతలను గుర్తించి డేటా ఎంట్రీ చేయాలన్నారు. మండల స్థాయి యోగాంధ్ర పోటీలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. గ్రామస్థాయి ట్రైనర్లకు పౌరులతో మ్యాపింగ్ చేయాలన్నారు. యోగాంధ్రకు జిల్లాలో 10 లక్షల మందిని రిజిస్ట్రేషన్ చేయాలని లక్ష్యం కాగా ఇప్పటి వరకు 8 లక్షల మందికి పైగా రిజిస్ట్రేషన్ జరిగాయన్నారు. టార్గెట్ పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలన్నారు.
బంగారం మళ్లీ మెరుపులు
● 10 గ్రాములు రూ.లక్షకుపైగా..
నెల్లూరు (బృందావనం): పది గ్రాముల మేలిమి బంగారం ధర మంగళవారం మళ్లీ లక్ష రూపాయలు దాటింది. ఏప్రిల్ 22న లక్షకు చేరువైంది. రోజు రోజుకు దోబూచులాటలాడుతూ మే 3వ తేదీన 24 క్యారెట్లు 10 గ్రాముల పసిడి ధర రూ.96,500 చేరింది. మే 6వ తేదీకి ఏకంగా ఒక్కసారిగా రూ.1,00,006కు చేరుకోగా, ఆ మరుసటి రోజు మే 7వ తేదీకి రూ.1,00,600లకు పెరిగింది. చేరింది. మే 8వ తేదీన రూ.600 తగ్గి రూ.లక్ష వద్ద నిలబడింది. ఆ తర్వాత తగ్గుతూ.. ఎగబాకుతూ రూ.95 వేలకు చేరింది. తాజాగా అంతర్జాతీయంగా చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో పుత్తడి పెరుగుదల తాత్కాలికమే అనడంతో కొనుగోలుదారులు కొంత ఊరట చెందారు. నెల రోజులుగా దిగొచ్చిన ధర మంగళవారం నాటికి రూ.1,00,260కి చేరింది. గతేడాది జూన్ 3వ తేదీన 24 క్యారెట్లు 10 గ్రాముల బంగారం ధర రూ.73,900 కాగా సరిగ్గా సంవత్సరానికి రూ.26,360 పెరగడం విస్మయం కలిగిస్తోంది.
ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించండి
● ఐదు రోజులపాటు డిపోల
ఎదుట ఎర్ర బ్యాడ్జీలతో నిరసన
నెల్లూరు సిటీ: ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఆర్టీసీ ఎన్ఎంయూఐ (నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్) జిల్లా కార్యదర్శి మురళీమోహన్రెడ్డి డిమాండ్ చేశారు. ప్రధాన ఆర్టీసీ బస్టాండ్తోపాటు అన్ని ఆర్టీసీ డిపోల్లో కార్మికులు, ఉద్యోగులు మంగళవారం ఎర్ర బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. మురళీమోహన్రెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని కార్మికులు సమస్యలపై గతంలో అనేక వినతులు ఇచ్చినా అధికారుల్లో స్పందన లేదన్నారు. ఆర్టీసీ ఆర్ఎం తీరుకు నిరసనగా మంగళవారం నుంచి ఈ నెల 7వ తేదీ వరకు జిల్లాలోని అన్ని ఆర్టీసీ డిపోల్లో నిరసన కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు. ఆత్మకూరు డిపో గ్యారేజ్ కార్యదర్శి కిషోర్బాబు అక్రమ సస్పెన్షన్ను రద్దు చేయాలన్నారు. కందుకూరు అసిస్టెంట్ మేనేజర్ చేసిన కార్గో అవినీతిపై విచారణ జరిపించాలన్నారు. కండక్టర్ వెంకటేశ్వర్లు అక్రమ సస్పెన్షన్ను తొలగించాలన్నారు. ఈ సమావేశంలో ఎన్ఎంయూఐ అధ్యక్షుడు చెంచయ్య, జానా వెంటకటేశ్వర్లు, రామ్ప్రసాద్, సునీల్బాబు, కేవీఆర్ రెడ్డి, మస్తానయ్య పాల్గొన్నారు.
రేపు వనమహోత్సవం
● ఒకే రోజు 4.20 లక్షల మొక్కలు నాటడం లక్ష్యం
నెల్లూరు (అర్బన్): ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం అటవీశాఖతో పాటు ఇతర ప్రభుత్వ శాఖల సమన్వయంతో వనమహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. 4.20 లక్షల మొక్కలను నాటేందుకు చర్యలు చేపట్టామని జిల్లా అటవీశాఖాధికారి మహబూబ్బాషా తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ భూతాపం తగ్గాలన్నా, వర్షాలు సకాలంలో కురవాలన్నా అడవులు పెరగాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సంవత్సరం వ్యవసాయ, ఇతర శాఖల సమన్వయంతో 50 లక్షలు మొక్కలు నాటబోతున్నామన్నారు. రైతుల వ్యవసాయ భూముల గట్లు, బీడు భూములు, ప్రభుత్వ భూముల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న స్థలాల్లో మొక్కలు నాటి వాటి పరిరక్షణకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. నెల్లూరు కొత్తూరు సమీపంలోని నగరవనంలో జిల్లా స్థాయిలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామన్నారు.