
బావిలో పడి వ్యక్తి మృతి
సీతారామపురం: స్థానిక గుంటమడుగు వాగు సమీపాన గల ఎరగ్రుంట్ల బావిలో శనివారం చేపలు పట్టేందుకు వెళ్లి రాజుగారి కాలనీ ప్రాంతంలోని మంగలి వీధికి చెందిన షేక్ మహబూబ్ బాషా(70) అనే వ్యక్తి మృతిచెందాడు. స్థానికుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మహబూబ్ బాషా దర్గాల వద్ద ముజావర్గా ఉంటూ, గ్రామంలో పాత ఇనుముకి ఎరగ్రడ్డలు, చక్కెర మిఠాయిలు ఇచ్చే వ్యాపారం చేస్తూ అందరితో కలివిడిగా ఉండేవాడు. ఖాళీ సమయంలో చేపలు పట్టే అలవాటు ఉండడంతో శనివారం ఉదయం గాలం తీసుకుని ఇంటి నుంచి బయలుదేరి ఎరగ్రుంట్ల బావి వద్దకు చేరుకున్నాడు. చేపలు పట్టే సమయంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మృతి చెందాడు. సాయంత్రం సమయంలో బావిలో ఈత కొట్టేందుకు వెళ్లిన యువకులు నీళ్లపై తేలియాడుతున్న మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో వారంతా బావి వద్దకు చేరుకుని కన్నీటి పర్యంతమయ్యారు.
రెండు బైక్లు ఢీకొని
ఇద్దరికి గాయాలు
పొదలకూరు: పట్టణానికి సమీపంలోని నెల్లూరు మార్గం కేఆర్ఆర్ నగర్ వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎదురెదురుగా రెండు మోటారు బైక్లు ఢీకొని ఇద్దరు యువకులు గాయపడ్డారు. స్థానికులు, పోలీసుల సమాచారం మేరకు రాజంపేటకు చెందిన నాగేంద్ర మోటారు బైక్పై తేనె అమ్ముకుంటుంటారు. ఈ క్రమంలో నెల్లూరు మార్గంలో బైక్పై వెళుతూ రోడ్డు దాటుతుండగా పొదలకూరు వైపు వస్తున్న మరో మోటారు బైక్ వచ్చి ఢీకొంది. ఈ ప్రమాదంలో నాగేంద్రతో పాటు ఢీకొన్న బైక్ నడుపుతున్న యువకుడు కూడా గాయపడ్డాడు. క్షతగాత్రులను 108 అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.