
మలేరియా నిర్మూలనకు చర్యలు
● డీఎంహెచ్ఓ డాక్టర్ సుజాత
నెల్లూరు(అర్బన్): మలేరియా నిర్మూలనకు చర్యలు తీసుకున్నట్లు డీఎంహెచ్ఓ వి.సుజాత పేర్కొన్నారు. మలేరియా నివారణ మాసోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం నెల్లూరులోని వైద్యశాఖ కార్యాలయం నుంచి సంతపేటలోని పలువీధుల మీదుగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె ర్యాలీని ప్రారంభించి మాట్లాడారు. మలేరియా వల్ల చలి, వాంతులు, వణుకుతో కూడిన తీవ్రమైన జ్వరం వస్తుందన్నారు. దోమ కుట్టిన 8 నుంచి 12 రోజుల్లో లక్షణాలు బయటపడతాయని తెలిపారు.
వెంటనే చికిత్స తీసుకోవడం ద్వారా ఈ వ్యాధి నుంచి బయటపడొచ్చన్నారు. ఒక్కోదఫా ప్రాణాంతకంగా మారుతుందన్నారు. మలేరియాను నివారించాలంటే దోమలు కుట్టకుండా, పుట్టకుండా చూసుకోవడమే సరైన మార్గమన్నారు. జిల్లా మలేరియా నివారణ అధికారి హుస్సేనమ్మ మాట్లాడుతూ మలేరియా అంతం మనతోనే సాధ్యమన్నారు. కార్యక్రమంలో అడిషనల్ డీఎంహెచ్ఓ ఖాదర్వలీ, మలేరియా సహాయ అధికారి నాగార్జునరావు, పీఎంపీ, ఆర్ఎంపీ నాయకులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.