వైఎస్సార్‌సీపీ నెల్లూరు పార్లమెంట్‌ పరిశీలకునిగా జంకె | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ నెల్లూరు పార్లమెంట్‌ పరిశీలకునిగా జంకె

Apr 30 2025 12:13 AM | Updated on Apr 30 2025 12:13 AM

వైఎస్

వైఎస్సార్‌సీపీ నెల్లూరు పార్లమెంట్‌ పరిశీలకునిగా జంకె

నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట): ఏపీఐఐసీ మాజీ చైర్మన్‌, మార్కాపురం మాజీ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డిని నెల్లూరు పార్లమెంట్‌ వైఎస్సార్‌సీపీ పరిశీలకునిగా నియమించినట్లు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయం మంగళవారం రాత్రి ఒక ప్రకటనలో పేర్కొంది. జంకె వెంకటరెడ్డి గతంలో ప్రకాశం జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షునిగా పనిచేశారు. రెండుసార్లు మార్కాపురం ఎమ్మెల్యేగా ఉన్నారు. గత ప్రభుత్వంలో ఏపీఐఐసీ చైర్మన్గా పనిచేశారు.

నేడు జెడ్పీ సర్వసభ్య సమావేశం

నెల్లూరు (పొగతోట): జిల్లా పరిషత్‌ సాధారణ సర్వసభ్య సమావేశం ఈనెల 30న ఉదయం 10.30 గంటలకు జెడ్పీ సమావేశ మందిరంలో జరుగుతుందని జెడ్పీ సీఈఓ విద్యారమ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. వ్యవసాయ, గ్రామీణ నీటి సరఫరా, జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌ అంచనా బడ్జెట్‌లపై సమీక్షించడం జరుగుతుందని తెలిపారు. చైర్‌పర్సన్‌ ఆనం అరుణ మ్మ అధ్యక్షతన సమావేశం జరుగుతుంది. స భ్యులు తప్పనిసరిగా హాజరు కావాలని కోరారు.

సెలవుపై వెళ్లిన ఫిషరీస్‌ జేడీ

నెల్లూరు (పొగతోట): ఫిషరీస్‌ జేడీ నాగేశ్వరరావు నెల రోజుల పాటు సెలవుపై వెళ్లారు. ఆరోగ్య రీత్యా ఆసుపత్రిలో చెకప్‌ నిమిత్తం సెలవులో వెళ్లినట్లు సమాచారం. విజయవాడలో పనిచేస్తున్న ఫిషరీష్‌ జేడీ కె.శాంతికి నెల్లూరు జేడీగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు.

సీఎం పర్యటన

ఏర్పాట్ల పరిశీలన

ఆత్మకూరు: ఆత్మకూరు పట్టణంలో మే 1వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించనున్న నేపథ్యంలో కలెక్టర్‌ ఓ ఆనంద్‌, ఎస్పీ కృష్ణకాంత్‌లు మంగళవారం డివిజనల్‌ అధికారులతో కలిసి ఏర్పాట్లు పరిశీలించారు. భద్రతాపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కలెక్టర్‌, ఎస్పీలు, పోలీస్‌, రెవెన్యూ అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం నెల్లూరుపాళెం గిరిజనకాలనీ వద్ద సీఎం స్వయంగా పింఛన్‌ అందజేసే ఇంటిని, గిరిజనకాలనీని వారు సందర్శించారు. ఇంజినీరింగ్‌ కళాశాల ఎదురుగా భవన నిర్మాణ కార్మికులతో సీఎం మాట్లాడనుండడంతో అక్కడ పరిస్థితులు పరిశీలించారు. సీఎం పర్యటన సందర్భంగా ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కో అధికారిని పర్యవేక్షణకు నియమిస్తూ కలెక్టర్‌ వారికి బాధ్యతలు అప్పగించారు.

స్థలాల క్రమబద్ధీకరణకు చర్యలు

నెల్లూరు(బారకాసు): నగరపాలక సంస్థ పరిధిలోని ప్రభుత్వ భూముల్లో 2019 సెప్టెంబర్‌ 15వ తేదీ వరకు నిర్మించి ఉండి అభ్యంతరం లేని ఆక్రమణలను క్రమబద్ధీకరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కమిషనర్‌ వైఓ నందన్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు, ప్రజాప్రతినిధుల అభ్యర్థుల మేరకు అభ్యంతరాల్లేని నివాసాలను క్రమబద్ధీకరణ చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించిందని తెలియజేశారు. నివాస హక్కులను పొందాలని కమిషనర్‌ సూచించారు. అన్ని డివిజన్లలో నిర్వహిస్తున్న సర్వేకు ప్రజలంతా స్వచ్ఛందంగా సహకరించి సంబంధిత వార్డు సచివాలయాల్లోని వీఆర్వోల లాగిన్‌ల ద్వారా దాఖలు చేసుకోవాలన్నారు.

కిలో పొగాకు

గరిష్ట ధర రూ.280

మర్రిపాడు: డీసీపల్లి పొగాకు వేలం కేంద్రంలో మంగళవారం కిలో పొగాకు గరిష్ట ధర రూ.280 పలికింది. వేలానికి 781 బేళ్లు రాగా, 593 బేళ్లను కొనుగోలు చేసినట్లు వేలం నిర్వహణాధికారి జీ రాజశేఖర్‌ తెలిపారు. వేలంలో కిలో పొగాకు గరిష్టంగా రూ.280, కనిష్టంగా రూ.210, సగటున రూ.252.46 ధర పలికిందని వివరించారు.

కలిగిరి: స్థానిక పొగాకు వేలం కేంద్రంలో కిలో పొగాకు గరిష్ట ధర రూ. 280 పలికింది. వేలానికి రైతులు 571 బేళ్లను తీసుకురాగా, 471 బేళ్లను కొనుగోలు చేసినట్లుగా వేలం నిర్వహణాధికారి నివేశ్‌కుమార్‌ పాండే తెలిపారు.

వైఎస్సార్‌సీపీ నెల్లూరు  పార్లమెంట్‌ పరిశీలకునిగా జంకె 1
1/1

వైఎస్సార్‌సీపీ నెల్లూరు పార్లమెంట్‌ పరిశీలకునిగా జంకె

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement