
ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం
● జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ
నెల్లూరు (పొగతోట): భారతదేశం ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమని, దానికి కారణం భారత రాజ్యాంగమేనని జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ అన్నారు. మంగళవారం 75వ భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా జెడ్పీలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. చైర్పర్సన్ మాట్లాడుతూ రాజ్యాంగాన్ని జాతికి అంకితం చేసిన రోజును 2015లో కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ దినోత్సవంగా ప్రకటించిందన్నారు. రాజ్యాంగాన్ని శక్తివంతమైన ఆయుధంగా మలిచి కోట్లాది మంది ప్రజలకు అందించారన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత పూర్వక రాజ్యాంగమన్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పాత్ర ఎప్పటికి మరువలేనిదన్నారు. మన రాజ్యాంగం స్వేచ్ఛ సమానత్వం, ప్రాథమిక హక్కులు, జాతి అభివృద్ధికి సోపానాలన్నారు. ప్రపంచంలోనే అత్యంత విశిష్ట స్థానాన్ని సంపాదించిన రాజ్యాంగాన్ని గుర్తు చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ విద్యారమ, డిప్యూటీ సీఈఓ మోహన్రావు, కార్యాలయ అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
ఉదయగిరిలో
29న జాబ్మేళా
ఉదయగిరి: స్థానిక మేకపాటి రాజమోహన్రెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ నెల 29 స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఎంప్లాయీమెంట్ కార్యాలయం, సీడాఫ్ ఆధ్వర్యంలో జాబ్మేళా జరుగుతుందని కళాశాల ప్రిన్సిపల్ ఎన్.నారాయణ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ జాబ్మేళాలో కేఎల్ గ్రూపు, అమెజాన్, ఎస్ఎస్ ఇన్వెస్ట్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, అమర్ రాజా బ్యాటరీ కంపెనీలు పాల్గొని ఇంటర్వ్యూలు నిర్వహిస్తాయన్నారు. పదో తరగతి, ఐటీఐ, డిప్లొమా చదివిన నిరుద్యోగ యువతీ యువకులు ఈ జాబ్మేళాలో పాల్గొని సద్వినియోగం చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు 9177824585, 9491284199 నంబర్లలో సంప్రదించాలని కోరారు.
దేశాభివృద్ధిలో
భాగస్వాములు కావాలి
● ఎస్పీ జి. కృష్ణకాంత్
నెల్లూరు (క్రైమ్): రాజ్యాంగానికి లోబడి ప్రతి ఒక్క రూ పని చేస్తూ దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఎస్పీ జి.కృష్ణకాంత్ సూచించారు. మంగళవారం భార్యత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని క్యాంపు కార్యాలయంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులు, విధులు, చట్టాలే ప్రజలకు రక్షణన్నారు. పోలీసులు సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ, పౌరుల ప్రాథమిక హక్కులు, రాజ్యాంగ హక్కుల పరిరక్షించాలన్నారు. ప్రపంచంలోనే భారత్ది అతిపెద్ద రాజ్యాంగమన్నారు. భారతీయ జీవన గమనాన్ని ప్రతిబింబించే విలువైన సాధనమని, రాజ్యాంగ అధికరణలు, సూత్రాలు, మార్గదర్శకాలు, ప్రజ్యాస్వామ్య ఫలాలు ప్రజలందరికి చేరువయ్యేలా సిబ్బంది కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ ఏఎస్పీ మునిరాజా, ఎస్బీ ఇన్స్పెక్టర్ డి. వెంకటేశ్వరరావు, ఆర్ఐలు రాజారావు, పౌల్రాజు, ఆర్ఎస్ఐ తిరుమలరెడ్డి, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ప్రభుత్వ మెడికల్ కళాశాలకు
మరికొన్ని పీజీ సీట్లు
నెల్లూరు(అర్బన్): నగరంలోని ఏసీఎస్ఆర్ ప్రభుత్వ మెడికల్ కళాశాలకు మరికొన్ని పీజీ సీట్లు మంజూరు చేస్తూ ఎన్ఎంసీ (నేషనల్ మెడికల్ కౌన్సిల్ కమిషన్) మంగళవారం ఉత్తర్వులు విడుదల చేసింది. ఇప్పటి వరకు ఇక్కడ పీజీ సీట్లు లేవు. తొలి సారిగా ఈ ఏడాదిలో రెండు నెలల క్రితం పలు విభాగాలకు సంబంధించి 43 పీజీ సీట్లును ఎన్ఎంసీ మంజూరు చేసింది. తాజాగా జనరల్ సర్జరీ విభాగానికి 5, ఆర్థోపెడిక్ విభాగానికి 4 పీజీ సీట్లును మంజూరు చేయడం గమనార్హం. దీంతో మొత్తం ఆయా విభాగాల్లో 52 పీజీ సీట్లు మంజూరు కావడంతో ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో రోగులకు మరింత నాణ్యమైన స్పెషలిస్టు వైద్య సేవలు అందించేందుకు వీలవుతోంది. పీజీ సీట్లు మంజూరుపై మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వీరవెంకట నాగరాజమన్నార్ హర్షం వ్యక్తం చేశారు.

ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం