చ‌రిత్ర సృష్టించిన వరుణ్ చక్రవర్తి.. | Varun Chakravarthy Creates HISTORY Vs New Zealand; Becomes First Indian Player | Sakshi
Sakshi News home page

Champions Trophy 2025: చ‌రిత్ర సృష్టించిన వరుణ్ చక్రవర్తి..

Mar 3 2025 9:14 AM | Updated on Mar 3 2025 9:43 AM

Varun Chakravarthy Creates HISTORY Vs New Zealand; Becomes First Indian Player

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 లీగ్ స్టేజిని భారత్ విజయంతో ముగించింది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఆదివారం దుబాయ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 44 పరుగుల తేడాతో టీమిండియా గెలుపొందింది. భారత్ విజయంలో మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి కీలక పాత్ర పోషించాడు. తన కెరీర్‌లో రెండో వన్డే ఆడిన వరుణ్ చక్రవర్తి(Varun Chakravarthy) స్పిన్ మాయాజలంతో ప్రత్యర్ధి బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టాడు.

అతడిని ఎదుర్కోలేక కివీస్ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. చక్రవర్తి ఓవరాల్‌గా 5 వికెట్లు పడగొట్టి న్యూజిలాండ్ పతనాన్ని శాసించాడు. దీంతో లక్ష్య చేధనలో కివీస్ 205 పరుగులకే కుప్పకూలింది. ఈ క్రమంలో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన వరుణ్ చక్రవర్తి ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు.

చరిత్ర సృష్టించిన వరుణ్‌..
అంతర్జాతీయ వన్డేల్లో మ్యాచ్‌ల పరంగా అత్యంత వేగంగా ఐదు వికెట్ల హాల్‌ను అందుకున్న భారత బౌలర్‌గా వరుణ్ రికార్డులకెక్కాడు. వరుణ్ తన రెండో మ్యాచ్‌లోనే ఈ ఫీట్‌ను అందుకున్నాడు. ఇంతకుముందు ఈ రికార్డు భారత మాజీ క్రికెటర్ స్టువర్ట్ బిన్నీ పేరిట ఉండేది.  2014లో బంగ్లాదేశ్‌పై బిన్నీ తన మూడో వన్డేలో కేవలం 4 పరుగులిచ్చి 6 వికెట్లతో చెలరేగాడు.

తాజా మ్యాచ్‌తో బిన్నీ అల్‌టైమ్ రికార్డును చక్రవర్తి అధిగమించాడు. అదేవిధంగా ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో ఫైవ్‌​ వికెట్ల హాల్ సాధించిన మూడో భారత బౌలర్‌గా ఈ తమిళనాడు స్పిన్నర్ నిలిచాడు. వరుణ్ కంటే ముందు రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ ఈ ఫీట్‌ను అందుకున్నారు.

సెమీస్‌లో ఆసీస్‌తో ఢీ..
ఇక మంగ‌ళ‌వారం జ‌ర‌గ‌నున్న తొలి సెమీఫైన‌ల్లో దుబాయ్ వేదిక‌గా ఆస్ట్రేలియాతో భార‌త్ తాడోపేడో తెల్చుకోనుంది.  ఈ మ్యాచ్‌లో గెలిచి 2023 వ‌ర‌ల్డ్‌క‌ప్ ఫైన‌ల్‌ ఓట‌మికి బద‌లు తీర్చుకోవాల‌ని కసితో రోహిత్ సేన ఉంది. ప్రస్తుతం భార‌త జ‌ట్టు అన్ని విభాగాల్లో ప‌టిష్టంగా క‌న్పిస్తోంది. అయితే సెమీస్‌లో కూడా న‌లుగురు స్పిన్న‌ర్ల‌తో టీమిండియా బరిలోకి దిగుతుందా లేదా హ‌ర్షిత్ రాణాను మ‌ళ్లీ తుది జ‌ట్టులోకి తీసుకువ‌స్తుందో వేచి చూడాలి.

కివీస్‌తో ఆఖ‌రి లీగ్ మ్యాచ్‌కు రాణాకు విశ్రాంతి ఇచ్చిన టీమ్ మెనెజ్‌మెంట్‌.. వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తిని ప్లేయింగ్ ఎలెవ‌న్‌లోకి తీసుకొచ్చింది. అయితే జ‌ట్టులోకి వ‌చ్చిన వ‌రుణ్ త‌న అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న‌తో అంద‌రిని ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌లో మొత్తం న‌లుగురు స్పిన్న‌ర్ల‌తో భార‌త్ ఆడింది. 

మొత్తం న‌లుగురు స్పిన్న‌ర్లు కూడా త‌మ మార్క్‌ను చూపించారు. దీంతో తుది జ‌ట్టు కూర్పు భార‌త్‌కు స‌వాలుగా మారింది. అంత‌కు తోడు మ‌హ్మ‌ద్ ష‌మీ కూడా అంత రిథ‌మ్‌లో క‌న్పించ‌డం లేదు. మ‌రి భార‌త జ‌ట్టు మెనెజ్‌మెంట్ ఏమి నిర్ణ‌యం తీసుకుంటుందో మ‌రో 24 గంట‌ల‌కు వేచి చూడ‌క త‌ప్ప‌దు.
చదవండి: వారిద్దరూ అద్భుతం.. కానీ అది మాకు తలనొప్పిగా మారింది: రోహిత్‌
 

Advertisement
 
Advertisement
Advertisement