ఐపీఎల్-2026లో రాజస్తాన్ రాయల్స్ చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ తన భీకర ఫామ్ను కొనసాగిస్తున్నాడు. మంగళవారం ముల్లాన్పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో వైభవ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఇప్పటికే జస్ప్రీత్ బుమ్రా, జోష్ హాజిల్వుడ్, భువనేశ్వర్ కుమార్కు చుక్కలు చూపించిన వైభవ్.. తాజాగా అర్ష్దీప్ సింగ్, లాకీ ఫెర్గూసన్ వంటి స్పీడ్ స్టార్లను ఉతికారేశాడు.
కేవలం 16 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్లతో 43 పరుగులు చేశాడు. అయితే ఈ మ్యాచ్లో వైభవ్ మరో సిక్స్ కొట్టి ఉంటే ఓ ప్రపంచ రికార్డును తన పేరిట లిఖించుకునేవాడు. టీ20 క్రికెట్లో అత్యంత వేగంగా 100 సిక్సర్లు పూర్తి చేసిన బ్యాటర్గా రికార్డు సృష్టించేందుకు వైభవ్ అడుగు దూరంలో ఉన్నాడు. ఇప్పటివరకు 511 బంతులు ఎదుర్కొన్న వైభవ్ 99 సిక్సర్లు బాదాడు.
మరో సిక్సర్ బాదితో ఈ చారిత్రత్మక రికార్డు అతడి సొంతం అవుతుంది. ప్రస్తుతం ఈ అరుదైన ఫీట్ సాధించిన జాబితాలో వెస్టిండీస్ దిగ్గజం కిరాన్ పొలార్డ్(843 బంతులు) ఉన్నాడు. రాజస్తాన్ రాయల్స్ తమ తదుపరి మ్యాచ్లో మే1న జైపూర్ వేదికగా గుజరాత్ టైటాన్స్తో తలపడనుంది. ఈ మ్యాచ్లో పొలార్డ్ రికార్డును సూర్యవంశీ బ్రేక్ చేసే అవకాశముంది.
కాగా పంజాబ్తో జరిగిన మ్యాచ్లో వైభవ్ ఓ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో ఒక సీజన్లో అత్యంత వేగంగా 400 పరుగుల మైలురాయిని అందుకున్న ఆటగాడిగా సూర్యవంశీ రికార్డులకెక్కాడు. వైభవ్ ఈ ఫీట్ను కేవలం 167 బంతుల్లో మాత్రమే సాధించాడు.
చదవండి: IND vs AFG: సంజూ, కిషన్లకు పోటీ.. టీమిండియా వైపు దూసుకొస్తున్న సరికొత్త ప్లేయర్


