ప్రస్తుత భారత టీ20 జట్టులో సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ రూపంలో అద్బుతమైన ఇద్దరు వికెట్ కీపర్లు ఉన్నారు. ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్లోనూ వీరిద్దరూ సత్తాచాటారు. అయితే వీరికి పోటీగా ఇప్పుడు మరో వికెట్ కీపర్ బ్యాటర్ టీమిండియా వైపు దూసుకొస్తున్నాడు. అతడే పంజాబ్ కింగ్స్ ఆటగాడు ప్రభ్సిమ్రాన్ సింగ్.
ఐపీఎల్-2026లో ప్రభ్సిమ్రాన్ అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఓపెనర్గా పంజాబ్ కింగ్స్కు అతడు మెరుపు ఆరంభాలను అందిస్తున్నాడు. ప్రభ్సిమ్రాన్ ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్ల్లో 57.67 సగటుతో 346 పరుగులు సాధించాడు. ఇందులో 4 అర్ధసెంచరీలు ఉన్నాయి. మంగళవారం రాజస్తాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లోనూ అతడు హాఫ్ సెంచరీతో మెరిశాడు.
ప్రభుసిమ్రాన్ తన ప్రదర్శనలతో నిలకడగా మారుపేరుగా మారాడు. గత సీజన్లోనూ అతడు సత్తాచాటాడు. ఐపీఎల్లో మాత్రమే కాకుండా దేశవాళీ టోర్నీల్లోనూ ప్రభుసిమ్రాన్ అదరగొట్టాడు. విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో పంజాబ్ తరపున 9 వన్డే మ్యాచ్ల్లో 55.38 సగటుతో 443 పరుగులు చేశాడు. అదేవిధంగా ఆస్ట్రేలియా-ఏతో జరిగిన వన్డే సిరీస్లో భారత్-ఎ తరపున 102 (68 బంతుల్లో) మెరుపు సెంచరీతో చెలరేగాడు. అప్పటిలోనే అతడిని సీనియర్ జట్టులోకి తీసుకోవాలని డిమాండ్లు వినిపించాయి.
సంజూ, కిషన్ స్ధానాలకు ఎసరు!
ప్రభుసిమ్రాన్ తన సూపర్ ఫామ్ను కొనసాగిస్తుండడంతో అతడిని భారత జట్టు ఎంపిక చేయాలన్న వాదన మరోసారి వినిపిస్తోంది. అయితే టీ20 జట్టులో సంజూ శాంసన్, కిషన్ ఉండడంతో అతడికి చోటు దక్కే అవకాశం లేదు. కానీ వీరిద్దరిలో ఎవరైన విఫలమైతే కచ్చితంగా బ్యాకప్గా ప్రభ్సిమ్రాన్ ఉంటాడు.
కాబట్టి వారిద్దరూ ప్రభ్సిమ్రాన్ను దృష్టిలో పెట్టుకుని ఆడాల్సి ఉంటుంది. ఏ మాత్రం తేడా వచ్చినా వారు జట్టులో చోటు కోల్పోక తప్పదు. అయితే ఈ ఏడాది జూన్లో అఫ్గానిస్తాన్తో జరిగే వన్డే సిరీస్కు ప్రభ్సిమ్రాన్ ఎంపికయ్యే అవకాశముంది. ఈ సిరీస్కు రెగ్యులర్ వికెట్ కీపర్లు కేఎల్ రాహుల్, ధ్రువ్ జురెల్ వంటి వికెట్ కీపర్ బ్యాటర్లకు సెలక్టర్లు విశ్రాంతి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
దీంతో ప్రభ్సిమ్రాన్ను వికెట్ కీపర్గా ఎంపిక చేయాలని బీసీసీఐ సెలక్షన్ కమిటీ భావిస్తున్నట్లు సమాచారం. అతడితో యశస్వి జైశ్వాల్, రుతురాజ్ గైక్వాడ్లు కూడా అఫ్గాన్తో వన్డేల్లో ఆడనున్నట్లు సమాచారం.
చదవండి: IND vs AFG: టీమిండియా కెప్టెన్గా రిషబ్ పంత్.. ? వారికి లక్కీ ఛాన్స్?


