గిల్‌ను విమర్శించొద్దు!.. రెండో టెస్టులో అతడిని ఆడించండి: అజారుద్దీన్‌ | Too Dependent On Bumrah Kuldeep Should Play: Azharuddin On Gill & Co | Sakshi
Sakshi News home page

ఒక్కడిపైనే ఆధారపడొద్దు.. రెండో టెస్టులో అతడిని తప్పక ఆడించండి: అజారుద్దీన్‌

Jun 30 2025 10:38 AM | Updated on Jun 30 2025 11:16 AM

Too Dependent On Bumrah Kuldeep Should Play: Azharuddin On Gill & Co

టీమిండియా టెస్టు కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ (Shubman Gill)కు భారత క్రికెట్‌ జట్టు మాజీ సారథి మహ్మద్‌ అజారుద్దీన్‌ అండగా నిలిచాడు. కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లో ఓటమి చవిచూసిన ఈ యువ ఆటగాడిని విమర్శించడం తగదని హితవు పలికాడు. అతడికి మరికాస్త సమయం ఇవ్వాలని కోరాడు.

దిగ్గజాల  నిష్క్రమణ తర్వాత
ఇంగ్లండ్‌ పర్యటనకు ముందు కెప్టెన్‌ రోహిత్‌శర్మ (Rohit Sharma), దిగ్గజ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి (Virat Kohli) టెస్టులకు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. అంతకు ముందే ఆస్ట్రేలియా టూర్‌లో స్పిన్‌ దిగ్గజం రవిచంద్రన్‌ అశ్విన్‌ కూడా రిటైర్మెంట్‌ ప్రకటించాడు. ఇలాంటి తరుణంలో యువ ఆటగాడు శుబ్‌మన్‌ గిల్‌కు మేనేజ్‌మెంట్‌ టెస్టు జట్టు పగ్గాలు అప్పగించింది.

ఐదు వికెట్ల తేడాతో ఓటమి
ఈ క్రమంలో తొలుత టెండుల్కర్‌- ఆండర్సన్‌ ట్రోఫీ (Tendulkar- Anderson Trophy) ఆడేందుకు గిల్‌ సారథ్యంలోని జట్టు ఇంగ్లండ్‌కు వెళ్లింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి టెస్టులో భారత జట్టు ఐదు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. లీడ్స్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా ఐదు శతకాలు బాదినా ఫలితం లేకుండా పోయింది.

లోయర్‌ ఆర్డర్‌, బౌలింగ్‌ విభాగం వైఫల్యం, ఫీల్డర్ల తప్పిదాల కారణంగా గెలవాల్సిన మ్యాచ్‌ను చేజార్చుకుంది. ఈ నేపథ్యంలో గిల్‌ కెప్టెన్సీపై విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో మహ్మద్‌ అజారుద్దీన్‌ స్పందిస్తూ అతడికి మద్దతుగా నిలిచాడు.

తొందరపాటే అవుతుంది
‘‘కెప్టెన్‌గా అతడికి ఇదే తొలి మ్యాచ్‌. ఇప్పుడే కెప్టెన్సీ గురించి ఇంత చర్చ అవసరం లేదు. అతడికి ఇంకాస్త సమయం ఇవ్వాలి. ప్రతి ఒక్కరు అతడికి అండగా నిలవాల్సిన సమయం ఇది. ప్రతిసారీ ఏదో ఒక ఫిర్యాదు చేస్తూ ఆటగాళ్లను విమర్శించడం తగదు. 

ఏదేమైనా తొలి టెస్టు ఆఖర్లో మన బ్యాటింగ్‌ విభాగం కుప్పకూలింది. ఇప్పటికైనా సరైన కూర్పుతో జట్టును ఎంపిక చేసుకోవాలి. బౌలింగ్‌ కూడా మారాలి’’ అని స్పోర్ట్స్‌కీడాతో అజారుద్దీన్‌ పేర్కొన్నాడు.

కుల్దీప్‌ను తప్పక ఆడించండి
అదే విధంగా..  భారత బౌలింగ్‌ విభాగం గురించి మాట్లాడుతూ.. ‘‘ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రాపైనే జట్టు అతిగా ఆధారపడుతోంది. వికెట్లు పడగొట్టడంతో పాటు పరుగులు నియంత్రించేందుకు జట్టు ప్రతిసారి అతడినే ఆశ్రయిస్తోంది.

అతడు ఒక్కడే రాణిస్తే సరిపోదు. అనుభవజ్ఞులైన మరికొంత మంది బౌలర్లు కూడా తమ వంతు పాత్ర పోషించాలి. రెండో టెస్టులో స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ను తుది జట్టులోకి తీసుకోవాలి. తద్వారా బౌలింగ్‌లో వైవిధ్యం పెరుగుతుంది’’ అని అజారుద్దీన్‌ అభిప్రాయపడ్డాడు.

కాగా భారత్‌- ఇంగ్లండ్‌ మధ్య బుధవారం (జూలై 2-6)నుంచి రెండో టెస్టు మొదలుకానుంది. బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌ స్టేడియం ఇందుకు వేదిక. అయితే, ఇక్కడి పిచ్‌ పొడిగా ఉండనుండటంతో... కుల్దీప్‌ ప్రభావం చూపగలడని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. అజారుద్దీన్‌ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాడు.

చదవండి: SA vs ZIM: చరిత్ర సృష్టించిన బేబీ ఏబీడీ.. అరంగేట్రంలోనే వరల్డ్ రికార్డు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement