2026లో నిర్వహించనున్న 8వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్కు తెలంగాణ ఆతిథ్యం దక్కడం పట్ల రాష్ట్ర క్రీడలు, యువజన సేవల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం క్రీడారంగ అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.
రాష్ట్రంలో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా క్రీడా మౌలిక సదుపాయాల కల్పన, యువ క్రీడాకారులకు ప్రోత్సాహం, క్రీడల విస్తరణ కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల ఫలితంగానే తెలంగాణకు ఈ ప్రతిష్ఠాత్మక ఆతిథ్య అవకాశం లభించిందన్నారు. 2026 ఖేలో ఇండియా యూత్ గేమ్స్ నిర్వహణకు తెలంగాణను ఆతిథ్య రాష్ట్రంగా ఎంపిక చేసిన కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోదీకి, కేంద్ర క్రీడాశాఖ మంత్రి మన్సుక్ మాండవియాలకు మంత్రి వాకిటి శ్రీహరి కృతజ్ఞతలు తెలిపారు.
ఖేలో ఇండియా యూత్ గేమ్స్ నిర్వహణ ద్వారా దేశవ్యాప్తంగా వేలాది మంది యువ క్రీడాకారులు తెలంగాణకు రానున్నారని, రాష్ట్ర ఆతిథ్య సామర్థ్యాన్ని దేశానికి చాటిచెప్పే అవకాశం ఇదని మంత్రి పేర్కొన్నారు. సీఎం రేవంత్ మార్గదర్శకత్వంలో అన్ని శాఖల సమన్వయంతో ఈ క్రీడా మహోత్సవాన్ని అత్యంత విజయవంతంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు.
ఈ ప్రతిష్ఠాత్మక క్రీడల నిర్వహణ తెలంగాణలో క్రీడా సంస్కృతిని మరింత బలోపేతం చేయడంతో పాటు యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించడానికి, భావితర క్రీడాకారులకు ప్రేరణగా నిలవడానికి దోహదపడుతుందని మంత్రి వాకిటి శ్రీహరి ఆశాభావం వ్యక్తం చేశారు.


