
West Indies Vs India 2023: వెస్టిండీస్తో మూడు ఫార్మాట్ల సిరీస్ల నేపథ్యంలో టీమిండియా అక్కడికి చేరుకుంది. జూలై 12 నుంచి మ్యాచ్లు ఆరంభం కానున్న తరుణంలో శుక్రవారం కరేబియన్ దీవిలో అడుగుపెట్టింది. కాగా విమాన టికెట్లు అందరికీ ఒకేసారి అందుబాటులో లేని కారణంగా భారత ఆటగాళ్లు బ్యాచ్ల వారీగా విండీస్కు పయనమయ్యారు.
అమెరికా, లండన్, నెదర్లాండ్స్ నుంచి వెస్టిండీస్కు చేరుకున్నారు. ఇక టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ప్యారిస్, విరాట్ కోహ్లి లండన్ నుంచి త్వరలోనే బయల్దేరి రానున్నట్లు సమాచారం. కాగా ఇంగ్లండ్లో ఆస్ట్రేలియాతో ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ తర్వాత ఆటగాళ్లకు సుమారు నెలరోజుల పాటు విశ్రాంతి లభించిన విషయం తెలిసిందే.
విండీస్కు ఆలస్యంగా చేరుకోనున్న రోహిత్, కోహ్లి
ఈ నేపథ్యంలో రోహిత్, కోహ్లి తమ కుటుంబాలతో వెకేషన్కు వెళ్లారు. జాతీయ మీడియా వర్గాల సమాచారం ప్రకారం.. వీరిద్దరు వచ్చే వారం వెస్టిండీస్కు చేరుకోనున్నట్లు తెలుస్తోంది. ఇక జూలై 12- ఆగష్టు 13 వరకు టీమిండియా కరేబియన్ దీవిలో గడుపనుంది.
టెస్టు సిరీస్తో మొదలై.. టీ20 సిరీస్తో ఈ పర్యటన ముగియనుంది. కాగా రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆరంభానికి ముందు భారత జట్టు ఓ ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది. ఇక డబ్ల్యూటీసీ 2023-25 సైకిల్లో రోహిత్ సేనకు వెస్టిండీస్తో జూలై 12 నాటి మ్యాచ్ మొదటిది కానుంది. కాగా 2019లో చివరిసారిగా ఇరు జట్లు టెస్టు మ్యాచ్లో తలపడగా.. టీమిండియా విండీస్ను 2-0తో వైట్వాష్ చేసింది.
వెస్టిండీస్తో టెస్టు సిరీస్కు భారత జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, అజింక్య రహానే (వైస్ కెప్టెన్), కేఎస్ భరత్ (వికెట్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్ , మహ్మద్ సిరాజ్, ముకేష్ కుమార్, జయదేవ్ ఉనాద్కట్, నవదీప్ సైనీ.
చదవండి: WC 2023: వెస్టిండీస్ కొంపముంచిన జింబాబ్వే! ఇక ఆశలు వదులుకోవాల్సిందే!
Vice Captain Rahane on the way to West Indies for the Test series. pic.twitter.com/BFL7dJMwmM
— Johns. (@CricCrazyJohns) June 30, 2023