కమాన్‌ టీమిండియా.. భారత జట్టు ప్రపంచకప్‌ గెలవాలని దేశవ్యాప్తంగా పూజలు | T20 World Cup 2024 Final, IND VS SA: Fan Offering Prayers Through Out India To Win The Title | Sakshi
Sakshi News home page

కమాన్‌ టీమిండియా.. భారత జట్టు ప్రపంచకప్‌ గెలవాలని దేశవ్యాప్తంగా పూజలు

Jun 29 2024 12:27 PM | Updated on Jun 29 2024 1:48 PM

T20 World Cup 2024 Final, IND VS SA: Fan Offering Prayers Through Out India To Win The Title

టీ20 వరల్డ్‌కప్‌ 2024 ఫైనల్‌ ఇవాళ (జూన్‌ 29) జరుగనుంది. బార్బడోస్‌ వేదికగా భారత్‌, సౌతాఫ్రికా అమీతుమీ తేల్చుకోనున్నాయి. భారతకాలమానం ప్రకారం ఈ మ్యాచ్‌ రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్‌ కోసం యావత్‌ భారత దేశం కళ్లకు వొత్తులు పెట్టుకుని ఎదురుచూస్తుంది. ఈ సారి టీమిండియా ఎలాగైనా వరల్డ్‌కప్‌ గెలవాలని అభిమానులు తమ ఇష్ట దైవాలకు ప్రార్దనలు చేస్తున్నారు. 

దేశవ్యాప్తంగా అభిమానులు తమ ఫేవరెట్‌ ప్లేయర్ల పేరిట ప్రత్యేక పూజలు చేయిస్తున్నారు. టీమిండియా ఫ్యాన్స్‌ పూజలతో దేశవ్యాప్తంగా ప్రార్ధనాలయాలు కిక్కిరిసిపోయాయి. ప్రజలు అనునిత్యం టచ్‌లో ఉండే సోషల్‌మీడియా టీమిండియా నామస్మరణతో మార్మోగుతుంది. ఏ ప్లాట్‌ఫాంలో చూసినా టీమిండియాను ఉత్తేజపరిచే పోస్ట్‌లే దర్శనమిస్తున్నాయి. 140 కోట్లకుపైగా భారతీయులు ఈసారి వరల్డ్‌కప్‌ మనదే అని ధీమాగా ఉన్నారు. 

భారత ఆటగాళ్లు సైతం​ గతంలో కాకుండా ఈసారి చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. గ్రూప్‌ దశలో, సూపర్‌-8, సెమీస్‌లో ఇది స్పష్టంగా కనిపించింది. ఈ టోర్నీలో భారత్‌ అజేయ జట్టుగా ఉంది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అరివీర భయంకర ఫామ్‌లో ఉన్నాడు. సూర్యకుమార్‌, రిషబ్‌ పంత్‌ సత్తా చాటుతున్నారు. హార్దిక్‌ ఆల్‌రౌండర్‌ పాత్రకు న్యాయం చేస్తున్నారు. బౌలర్లంతా అద్భుతంగా రాణిస్తున్నారు. 

పేసు గుర్రం బుమ్రా అయితే పట్టపగ్గాల్లేకుండా దూసుకుపోతున్నాడు. విరాట్‌, శివమ్‌ దూబే ఫామ్‌ మినహాయించి టీమిండియా అన్ని విషయాల్లో భేషుగ్గా ఉంది. వీరిద్దరు ఫైనల్లో టచ్‌లోకి వస్తే టీమిండియాకు తిరుగుండదు. 

మరోవైపు సౌతాఫ్రికా సైతం గెలుపుపై ధీమాగా ఉంది. ఆ జట్టు కూడా ఈ టోర్నీలో అజేయంగా ఉంది. సౌతాఫ్రికా సైతం అన్ని విభాగాల్లో టీమిండియాతో సరిసమానంగా ఉంది. మన దగ్గర సూర్యకుమార్‌ ఉంటే.. వాళ్ల దగ్గర క్లాసెన్‌ ఉన్నాడు. మన దగ్గర రోహిత్‌ ఉంటే.. వారి దగ్గర మార్క్రమ్‌ ఉన్నారు. మన దగ్గర కోహ్లి ఉంటే.. వారి వద్ద మిల్లర్‌ ఉన్నారు. మన దగ్గర పంత్‌ ఉంటే.. వారి దగ్గర డికాక్‌ ఉన్నాడు. 

మన దగ్గర హార్దిక్‌ ఉంటే.. వారి దగ్గర జన్సెన్‌ ఉన్నాడు. బౌలింగ్‌ విషయానికొస్తే.. ఇరు జట్లలో మేటి పేసర్లు ఉన్నారు. మన దగ్గర బుమ్రా, అర్ష్‌దీప్‌ ఉంటే వారి దగ్గర రబాడ, నోర్జే ఉన్నారు. భారత్‌, సౌతాఫ్రికా మధ్య తేడా వచ్చేది స్పిన్‌ విభాగంలోనే. మన దగ్గర ప్రపంచ స్థాయి స్పిన్నర్లు కుల్దీప్‌, అక్షర్‌, జడేజా ఉండగా.. వారి దగ్గర షంషి, కేశవ్‌ మహారాజ్‌ మాత్రమే ఉన్నారు. భారత్‌ ఈ ఒక్క విషయంలో సఫారీలపై ఆధిక్యం కలిగి ఉంది. ఈ ఆధిక్యమే ఫైనల్లో టీమిండియాను గెలిపించే అవకాశం ఉంది. సో.. ఆల్‌ ద బెస్ట్‌ టీమిండియా.

Advertisement
 
Advertisement
Advertisement