ముంబై ఇండియన్స్కు మరో భారీ షాక్ తగిలినట్లు తెలుస్తోంది. హార్దిక్ పాండ్యా గైర్హాజరీలో గత మ్యాచ్లో (లక్నో) కెప్టెన్గా వ్యవహరించిన సూర్యకుమార్ యాదవ్ కూడా ముంబై ఇండియన్స్ క్యాంప్ను వీడాడని సమాచారం. హార్దిక్ గాయం కారణంగా ఆర్సీబీతో జరుగబోయే తదుపరి మ్యాచ్కు (మే 10న) కూడా దూరమయ్యాడని తెలుస్తోంది. హార్దిక్ ఇవాళ (మే 6) జట్టుతో కలిసి రాయ్పూర్కు (ఆర్సీబీ మ్యాచ్కు వేదిక) వెళ్లే ఫ్లైట్ ఎక్కలేదు. దీంతో అతను ఆర్సీబీ మ్యాచ్లో ఆడే అవకాశం కనిపించడం లేదు.
మరోవైపు ఆర్సీబీ మ్యాచ్కు సూర్యకుమార్ కూడా అందుబాటులో ఉండడని సమాచారం. సూర్యకుమార్ త్వరలో తండ్రి కానున్న నేపథ్యంలో భార్యకు దగ్గరగా ఉండేందుకు జట్టును వీడినట్లు తెలుస్తోంది. ఇద్దరు కెప్టెన్లు ఒకేసారి జట్టుకు అందుబాటులో లేకపోవడం మినుకుమినుకుమంటున్న ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్ అవకాశాలను మరింత సంక్లిష్టం చేయనుంది.
వీరి గైర్హాజరీలో కెప్టెన్సీ ఎవరు చేపడతారన్న అంశం ప్రస్తుతం ముంబై ఇండియన్స్ అభిమానులను సందిగ్దంలో పడేస్తుంది. రోహిత్ శర్మ కాకుండా బుమ్రా, తిలక్ వర్మ, రికెల్టన్ రూపంలో మూడు ఆప్షన్లు ఉన్నా, ఎవరన్నదే ప్రశ్నార్థకం.
ఇదిలా ఉంటే, ముంబై ఇండియన్స్ గత మ్యాచ్లో లక్నోపై గెలిచినా, ప్లే ఆఫ్స్ అవకాశాలు దాదాపుగా లేనట్లే అనుకోవాలి. టెక్నికల్గా రేసులో ఉన్నా, ముంబై ప్లే ఆఫ్స్ చేరాలంటే చాలా అద్భుతాలు జరగాలి. ఇప్పటివరకు ఆ జట్టు 10 మ్యాచ్ల్లో మూడే విజయాలతో పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉంది. నాలుగు ప్లే ఆఫ్స్ బెర్త్ల కోసం ఇప్పటికే 6 జట్ల మధ్య ప్రధాన పోటీ జరుగుతుంది.
ప్రస్తుతం టేబుల్ టాపర్గా ఉన్న పంజాబ్ సహా ఆర్సీబీ, ఎస్ఆర్హెచ్, రాజస్థాన్, గుజరాత్, సీఎస్కే ప్లే ఆఫ్స్ బెర్త్ల కొసం నువ్వా-నేనా అన్నట్లు పోటీపడుతున్నాయి. ఈ జట్లను దాటి తొమ్మిదో స్థానంలో ఉన్న ముంబై ప్లే ఆఫ్స్ రేసులోకి రావడం దాదాపుగా అసాధ్యమనే చెప్పాలి.


