సగర్వంగా ఫైనల్‌కు.. | Sakshi
Sakshi News home page

సగర్వంగా ఫైనల్‌కు..

Published Sun, Nov 8 2020 6:21 AM

Supernovas beat Trailblazers in thrilling finish to set up repeat clash in final - Sakshi

షార్జా: డిఫెండింగ్‌ చాంపియన్‌ సూపర్‌ నోవాస్‌ అనుకున్నది సాధించింది. ఒత్తిడిని సమర్థంగా ఎదుర్కొని మహిళల టి20 చాలెంజ్‌ టోరీ్నలో ఫైనల్‌ బెర్తును ఒడిసి పట్టింది. గెలుపు... ట్రయల్‌ బ్లేజర్స్‌వైపు మొగ్గుతోన్న దశలో రాధా యాదవ్‌ (2/30) అద్భుత బౌలింగ్‌తో సూపర్‌ నోవాస్‌ను 2 పరుగులతో గెలిపించింది. బ్లేజర్స్‌ విజయానికి చివరి ఓవర్‌లో 10 పరుగులు చేయాల్సి ఉండగా... రాధ కేవలం 7 పరుగులు మాత్రమే ఇచ్చి ఓ వికెట్‌ను దక్కించుకుంది. దీంతో శనివారం జరిగిన చివరి లీగ్‌ మ్యాచ్‌లో ట్రయల్‌ బ్లేజర్స్‌కు ఓటమి తప్పలేదు. మూడు జట్ల మధ్య లీగ్‌ మ్యాచ్‌లు ముగిశాక మూడు జట్లూ ఒక్కో విజయంతో రెండు పాయింట్లతో సమంగా నిలిచాయి.

అయితే మెరుగైన రన్‌రేట్‌ కారణంగా స్మృతి మంధాన నేతృత్వంలోని ట్రయల్‌ బ్లేజర్స్‌ (+2.109), హర్మన్‌ప్రీత్‌ కెపె్టన్సీలోని సూపర్‌ నోవాస్‌ (–0.054) జట్లు ఫైనల్లోకి ప్రవేశించగా... హైదరాబాద్‌ క్రికెటర్‌ మిథాలీ రాజ్‌ నాయకత్వం వహిస్తున్న వెలాసిటీ (–1.869) జట్టు లీగ్‌ దశలోనే నిష్క్రమించింది. సోమవారం జరిగే ఫైనల్లో ట్రయల్‌ బ్లేజర్స్, సూపర్‌ నోవాస్‌ అమీతుమీ తేల్చుకుంటాయి. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేసిన సూపర్‌ నోవాస్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 146 పరుగులు చేసింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ చమరి ఆటపట్టు జయాంగని (48 బంతుల్లో 67; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధసెంచరీతో ఆకట్టుకుంది. 147 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ట్రయల్‌ బ్లేజర్స్‌ జట్టు 20 ఓవర్లు ఆడి 5 వికెట్లకు 144 పరుగులు చేసి ఓడిపోయింది. దీప్తి శర్మ (43 నాటౌట్‌) రాణించినా జట్టును గెలిపించలేకపోయింది.

Advertisement
Advertisement