సెంచరీతో చెలరేగిన మంధాన.. దక్షిణాఫ్రికా ముందు భారీ టార్గెట్‌ | Smriti Mandhana Brings Up Her Sixth ODI Century In Bengaluru | Sakshi
Sakshi News home page

SA vs IND: సెంచరీతో చెలరేగిన మంధాన.. దక్షిణాఫ్రికా ముందు భారీ టార్గెట్‌

Jun 16 2024 5:37 PM | Updated on Jun 16 2024 5:48 PM

Smriti Mandhana Brings Up Her Sixth ODI Century In Bengaluru

చిన్నస్వామి స్టేడియం వేదికగా దక్షిణాఫ్రికా మహిళలతో జరుగుతున్న తొలి వన్డేలో భారత బ్యాటర్లు రాణించారు. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత మహిళల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 265 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది. 

టీమిండియా బ్యాటర్లలో స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన అద్భుతమైన సెంచరీతో చెలరేగింది. 55 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన భారత్‌ను మంధాన తన విరోచిత సెంచరీతో ఆదుకుంది. ఈ మ్యాచ్‌లో 127 బంతులు ఎదుర్కొన్న మంధాన 12 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 117 పరుగులు చేసింది. 

స్మృతికి ఇది ఆరో అంతర్జాతీయ వన్డే సెంచరీ కావడం గమనార్హం. భారత బ్యాటర్లలో మంధానతో పాటు దీప్తీ శర్మ(37), పూజా వస్త్రాకర్‌(31 నాటౌట్‌) పరుగులతో రాణించారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఖాకా 3 వికెట్లు పడగొట్టగా.. క్లాస్‌ రెండు, డెకరసన్‌, మల్బా, షాంగసే తలా వికెట్‌ సాధించారు.

మంధాన అరుదైన రికార్డు
ఇక ఈ మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన మంధాన ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకుంది. అంతర్జాతీయ వన్డేల్లో భారత మహిళల జట్టు తరపున అత్యధిక సెంచరీలు చేసిన రెండో బ్యాటర్‌గా స్మృతి(6 సెంచరీలు) రికార్డులకెక్కింది. 

ఇప్పటివరకు ఈ రికార్డు భారత కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌(5) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో హర్మన్‌ ప్రీత్‌ రికార్డును మంధాన బ్రేక్‌ చేసింది. ఈ అరుదైన ఫీట్‌ సాధించిన జాబితాలో భారత మాజీ కెప్టెన్‌ మిథాలీ రాజ్‌(7) ఉంది.

 

Advertisement
 
Advertisement
Advertisement