Photo Courtesy: IPL 2026
ఐపీఎల్ 19వ సీజన్లో సీఎస్కేతో జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. వరుసగా రెండు విజయాలతో జోష్ మీదున్న పంజాబ్కు ఊహించని షాక్ తగిలింది. ఇప్పటికే గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో స్లో ఓవర్ రేట్ నమోదు చేసినందుకు పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్కు ఐపీఎల్ నిర్వాహకులు జరిమానా విధించారు.
తాజాగా చెన్నైతో మ్యాచ్లో మరోసారి స్లో ఓవర్ రేట్ నమోదు చేయడంతో ఈసారి కెప్టెన్తో పాటు జట్టు ఆటగాళ్లు సహా ఇంపాక్ట్ ప్లేయర్ మ్యాచ్ ఫీజులో కోత విధిస్తున్నట్లు ఐపీఎల్ నిర్వాహకులు తెలిపారు. ఐపీఎల్ కౌన్సిల్ మాట్లాడుతూ..‘చెన్నై సూపర్కింగ్స్తో జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ స్లో ఓవర్ రేట్ నమోదు చేసింది.
ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి (కోడ్ ఆఫ్ కండక్ట్) ఆర్టికల్ 2.22 ప్రకారం స్లో ఓవర్ రేట్ నమోదు చేసి నిబంధనలు ఉల్లంఘించిన పంజాబ్ జట్టుపై చర్యలు తీసుకుంటున్నాం. అయితే కెప్టెన్ అయ్యర్కు ఇది0 రెండో స్లో ఓవర్రేట్ కావడంతో అతని మ్యాచ్ ఫీజులో రూ. 24 లక్షలు కోత విధిస్తున్నాం. అంతేకాదు జట్టులోని 11 మంది ఆటగాళ్లు సహా ఇంపాక్ట్ ప్లేయర్ నుంచి ఆరు లక్షలు లేదా వారి మ్యాచ్ ఫీజుల్లో 25 శాతం జరిమానా విధిస్తున్నాం.’ అని ఐపీఎల్ కౌన్సిల్ తన ప్రకటనలో వెల్లడించింది.
మళ్ళీ తప్పు చేస్తే నిషేధం!
ఈ సీజన్లో పంజాబ్ జట్టు మూడోసారి కూడా స్లో ఓవర్ రేటును నమోదు చేస్తే అప్పుడు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. అప్పుడు కెప్టెన్ కు 30లక్షల జరిమానా విధించబడుతుంది. ఇంపాక్ట్ ప్లేయర్ సహా తుది జట్టులోని ఆటగాళ్లకు తలా 12 లక్షలు లేదంటే మ్యాచ్ ఫీజులో 50 శాతం రెండింటిలో ఏది తక్కువ అయితే అది జరిమానా విధించబడుతుంది. అంతేకాదు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఒక మ్యాచ్ నిషేధాన్ని ఎదుర్కొనే అవకాశముంది.
మ్యాచ్ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. ఆయుశ్ మాత్రే 73 పరుగులతో రాణించాడు. అనంతరం పంజాబ్ కింగ్స్ 18.4 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి 210 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది.


