పాకిస్తాన్ పేసర్ నసీం షా చిక్కుల్లో పడ్డాడు. పాక్లోని పంజాబ్ ముఖ్యమంత్రి మరియం నవాజ్ గురించి అతడు చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. దీంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) నసీం షాకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
సీఎంను ఆహ్వానించిన పీసీబీ
అసలేం జరిగిందంటే.. పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL) మార్చి 26న ఆరంభమైన సంగతి తెలిసిందే. లాహోర్లోని గడాఫీ స్టేడియంలో జరిగిన ఆరంభ మ్యాచ్ వీక్షించాల్సిందిగా పీసీబీ పంజాబ్ సీఎం మరియం నవాజ్ను ఆహ్వానించింది. ఈ క్రమంలో లాహోర్ ఖలందర్స్, హైదరాబాద్ కింగ్స్మన్ జట్ల ఫ్రాంఛైజీ యజమానులకు పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నక్వీ.. మరియంను పరిచయం చేశాడు.
ఆమెను ఎందుకు రాణిలా ట్రీట్ చేస్తున్నారు
ఆ తర్వాత ఇరుజట్ల ఆటగాళ్లతో కూడా ముఖ్యమంత్రి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమెకు అత్యంత గౌరవం ఇవ్వడాన్ని తప్పుబట్టిన నసీం షా.. ‘లార్డ్స్ (ఇంగ్లండ్ మైదానం)లో రాణిలా.. ఇక్కడిలా ఈమెను ఎందుకు చూస్తున్నారు? ఎందుకింత హడావుడి?’ అని నసీం షా ఎక్స్ అకౌంట్లో రాసుకొచ్చాడు. దీంతో వివాదం చెలరేగింది.

నా అకౌంట్ హ్యాక్ అయింది
ఈ నేపథ్యంలో దిద్దుబాటు చర్యలకు దిగిన నసీం షా.. తన సోషల్ మీడియా అకౌంట్ హ్యాక్ అయిందని.. తాను ఎవరినీ ఉద్దేశించి ఎలాంటి వ్యాఖ్యలూ చేయలేదని స్పష్టం చేశాడు. అయితే, పీసీబీ మాత్రం నసీం షా చర్యను తీవ్రంగా పరిగణించింది.
అతడు సెంట్రల్ కాంట్రాక్టు, మీడియా నిబంధనలు ఉల్లంఘించాడని.. అలాంటి ట్వీట్ చేయడానికి గల కారణం ఏమిటో తెలపాలంటూ షోకాజ్ నోటీసులు ఇచ్చింది. కాగా పీఎస్ఎల్లో నసీం షా రావల్పిండి పిండిజ్కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.
ఇక పాకిస్తాన్ తరఫున ఇప్పటికి 20 టెస్టులు, 34 వన్డేలు, 37 టీ20 మ్యాచ్లు ఆడాడు నసీం షా. 23 ఏళ్ల ఈ కుడిచేతి వాటం ఫాస్ట్బౌలర్ ఖాతాలో 60 టెస్టు వికెట్లు, 60 వన్డే వికెట్లు, 32 టీ20 వికెట్లు ఉన్నాయి. టీ20 ప్రపంచకప్-2026లో భాగంగా శ్రీలంకతో మ్యాచ్లో చివరగా పాక్కు ప్రాతినిథ్యం వహించాడు నసీం షా.


