ఐపీఎల్ 2026 సీజన్ ముగింపు దశకు చేరుకున్న వేళ చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని రిటైర్మెంట్పై మరోసారి చర్చ మొదలైంది. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ఇవాళ (మే 18) సన్రైజర్స్ హైదరాబాద్తో జరగనున్న మ్యాచ్ ఈ సీజన్లో సీఎస్కేకు చివరి హోం మ్యాచ్ కావడంతో అభిమానుల్లో భావోద్వేగ వాతావరణం నెలకొంది.
గాయం కారణంగా ఈ సీజన్ ప్రారంభం నుంచి బెంచ్కే పరిమితమైన ధోని.. ఈ మ్యాచ్లో బరిలోకి దిగుతాడా..? ఇదే అతని చివరి ఐపీఎల్ మ్యాచ్ అవుతుందా..? అన్న ప్రశ్నలు సోషల్మీడియాలో వైరల్గా మారాయి.
ఈ ప్రచారంపై ధోని తాజాగా చేసిన కొన్ని వ్యాఖ్యలు అభిమానులను తీవ్ర భావోద్వేగానికి గురి చేస్తున్నాయి. ప్రస్తుత కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్కు జట్టును తనదైన శైలిలో నడిపించాలని చెప్పినట్లు ధోని స్వయంగా వెల్లడించాడు. "సీఎస్కేను నువ్వు ఎలా నడపాలనుకుంటే అలా నడుపు. కెప్టెన్ నిర్ణయాలే జట్టును ముందుకు తీసుకెళ్తాయి. కోచ్లు, సపోర్ట్ స్టాఫ్ ఉన్నా చివరి నిర్ణయం కెప్టెన్దే" అంటూ ధోని చేసిన వ్యాఖ్యలు అతని రిటైర్మెంట్పై పూర్తి క్లారిటీ ఇస్తున్నాయి.
ధోని ఇవాళ తన చివరి ఐపీఎల్ మ్యాచ్ ఆడనున్నాడని ఫ్యాన్స్ నిర్దారణకు వచ్చేశారు. అయితే ఈ కథలో మరో ట్విస్ట్ కూడా కనిపిస్తోంది. కొన్ని మీడియా కథనాల ప్రకారం, ధోని తాజాగా మరో గాయానికి గురైనట్లు తెలుస్తోంది. ఈ కారణంగా ఎస్ఆర్హెచ్తో ఇవాళ జరిగే మ్యాచ్కూ అతను దూరమయ్యే అవకాశం ఉందని సమాచారం. ధోని రిటైర్మెంట్పై ఉత్కంఠ మరి కొద్ది గంటల్లో వీడనుంది.
మరోవైపు ప్రస్తుత సీజన్ సీఎస్కే పరిస్థితి కూడా ఆసక్తికరంగానే ఉంది. రుతురాజ్ గైక్వాడ్ నేతృత్వంలో ఆ జట్టు ప్లేఆఫ్స్ రేసులో నిలబడేందుకు ప్రయత్నిస్తోంది. ఇలాంటి సమయంలో ధోని మైదానంలో కనిపిస్తే ఆ జట్టుకు అదనపు ఉత్సాహం లభించే అవకాశం ఉంది. అభిమానులు సైతం "తలా"ను మరోసారి చెపాక్లో బ్యాటింగ్ చేస్తూ చూడాలని కోరుకుంటున్నారు.


