పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్, ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు మోహిసిన్ నఖ్వీ, ఐసీసీ చైర్మన్గా జై షా స్థానాన్ని భర్తీ చేస్తాడని గత కొద్ది రోజులుగా సోషల్మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీనిపై నఖ్వీ తాజాగా స్పందించాడు. ఈ ప్రచారంలో వాస్తవం లేదని తేల్చి చెప్పారు. ఇప్పటికే తనకు చాలా బాధ్యతలు ఉన్నట్లు చెప్పుకొచ్చాడు. వాటి పనిభారమే అధికంగా ఉందని తెలిపాడు. ఐసీసీ చైర్మన్గిరిపై ఆలోచన కూడా లేదని స్పష్టం చేశాడు.
ఇదే సందర్భంగా పాకిస్తాన్ సూపర్ లీగ్కు సంబంధించిన పలు విషయాలను కూడా వెల్లడించాడు. పీఎస్ఎల్లో ప్రేక్షకుల అనుమతి విషయం ప్రధానితో చర్చిస్తానని తెలిపాడు. మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు, ఇంధన సంక్షోభం కారణంగా పాక్ ప్రభుత్వం ఖర్చులు తగ్గించేందుకు పీఎస్ఎల్ మ్యాచ్లకు ప్రేక్షకులను అనుమతించని విషయం తెలిసిందే.
కాగా, ఐసీసీ చైర్మన్గా నఖ్వీ వస్తాడన్న ప్రచారాన్ని భారత క్రికెట్ అభిమానులు ముందే తోసి పుచ్చారు. నఖ్వీకు అంత సీన్ లేదని లైట్ తీసుకున్నారు. అతనికి ఆసియా క్రికెట్ కౌన్సిల్ చైర్మన్గిరినే చాలా ఎక్కువని అన్నారు. జై షాను పక్కకు పెట్టి నఖ్వీని ఐసీసీ పీఠంపై కూర్చోబెడతారని అనుకోవడం మూర్ఖత్వమని ఎద్దేవా చేశారు. ఆనుకున్నట్లుగానే నఖ్వీనే ముందుకు వచ్చి తనకు అంత సీన్ లేదని చెప్పడంతో పాక్ అభిమానులు తోకముడిచారు.
జై షా పదవీకాలం ఇంకా ఉంది
ఐసీసీ అధ్యక్షుడిగా జై షా 2024 డిసెంబర్ 1న బాధ్యతలు చేపట్టారు. ఈ పదవిలో అతను మూడేళ్ల పాటు ఉంటారు. ఈ విషయం కూడా తెలియకుండానే పాక్ అభిమానులు నఖ్వీ త్వరలో ఐసీసీ పీఠాన్ని అధిరోహిస్తాడని డబ్బాలు కొట్టుకున్నారు. తీరా నఖ్వీనే ప్రకటన చేసే సరికి మిన్నకుండిపోయారు.


