జింబాబ్వే పర్యటన, ఆసియా క్రీడలకు బాధ్యతలు
న్యూఢిల్లీ: మణికట్టు మాంత్రికుడు వీవీఎస్ లక్ష్మణ్ మరోసారి భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ అవతారమెత్తనున్నాడు. ప్రస్తుతం భారత జట్టు ఇంగ్లండ్లో పర్యటిస్తుండగా... ఇంగ్లండ్తో టి20, వన్డే సిరీస్లు ముగిసిన వెంటనే జింబాబ్వేకు వెళ్లనుంది. ఈ నెల 23 నుంచి 27 మధ్య జింబాబ్వేతో టీమిండియా మూడు టి20 మ్యాచ్ల సిరీస్ ఆడనుంది. ఈ పర్యటనలో సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ (సీఓఈ) హెడ్ లక్ష్మణ్... టీమిండియా ప్రధాన కోచ్గా వ్యవహరించనున్నాడు.
బ్యాటింగ్ కోచ్ కనిత్కర్, బౌలింగ్ కోచ్ సునీల్ జోషీతో కలిసి అతడు బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. అలాగే ఆసియా క్రీడలకు కూడా అతడే కొనసాగనున్నాడు. జపాన్ వేదికగా జరగనున్న ఏషియన్ గేమ్స్ సమయంలో భారత జట్టు స్వదేశంలో వెస్టిండీస్తో వన్డే సిరీస్ ఆడనుండగా ఆ జట్టుతో గంభీర్ ఉంటాడు. భారత ద్వితీయ శ్రేణి జట్టుకు కోచ్గా వ్యవహరించడం లక్ష్మణ్కు కొత్తేమీ కాదు. 2023 హాంగ్జూ ఆసియా క్రీడలతో పాటు... 2024 జింబాబ్వే పర్యటన సమయంలోనూ అతడే టీమిండియా కోచ్గా వ్యవహరించాడు.


