
దులీప్ ట్రోఫీ-2025కు ముందు సెంట్రల్ జోన్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. టీమిండియా వెటరన్, విధర్బ స్టార్ బ్యాటర్ కరుణ్ నాయర్ గాయం కారణంగా ఈ ఏడాది దులీప్ ట్రోఫీకి దూరం కానున్నట్లు తెలుస్తోంది. ఓవల్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన ఆఖరి టెస్టులో నాయర్ చేతి వేలికి స్వల్ప గాయమైంది. దీంతో వైద్యుల సూచన మేరకు ఈ దేశవాళీ టోర్నీకి దూరంగా ఉండాలని కరుణ్ నిర్ణయించుకున్నట్లు సమాచారం.
ఏడేళ్ల తర్వాత భారత టెస్టు జట్టులోకి తిరిగొచ్చిన కరుణ్ నాయర్.. ఇంగ్లండ్ సిరీస్లో అందరి అంచనాలను అందుకోలేకపోయాడు. ఈ సిరీస్లో నాలుగు మ్యాచ్లు ఆడి కేవలం 205 పరుగులు మాత్రమే చేశాడు. ఒకవేళ నాయర్ దులీప్ ట్రోఫీలో ఆడి మెరుగ్గా రాణించింటే భారత టెస్టు జట్టులో తన స్ధానం పదిలంగా ఉండేది. కానీ ఇప్పుడు గాయం బారిన పడడంతో జట్టులో అతడి స్ధానానికి గ్యారంటీ లేదు. స్వదేశంలో వెస్టిండీస్,దక్షిణాఫ్రికాతో జరిగే సిరీస్లకు నాయర్ను సెలక్టర్లు పక్కన పెట్టే అవకాశముంది.
"ఓవల్ టెస్ట్ రెండో ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేస్తుండగా ఓ బంతి కరుణ్ నాయర్ చేతివేలికి తాకింది. వెంటనే చిన్నగా వాపు కూడా వచ్చింది. దీంతో రాబోయే దులీప్ ట్రోఫీలో నాయర్ సెంట్రల్ జోన్ తరపున అతడు ఆడడు అని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. కాగా భారత టెస్టు జట్టులో కరుణ్ నాయర్ స్దానాన్ని మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్తో భర్తీ చేసే అవకాశముంది. కాగా దులిప్ ట్రోఫీ-2025 నాకౌట్ మ్యాచ్లు ఆగస్టు 28 నుంచి సెప్టెంబరు 15 వరకు జరగనున్నాయి.
దులీప్ ట్రోఫీ-2025 షెడ్యూల్
👉ఆగష్టు 28- 31: తొలి క్వార్టర్ ఫైనల్- నార్త్ జోన్ వర్సెస్ ఈస్ట్ జోన్
👉ఆగష్టు 28- 31: రెండో క్వార్టర్ ఫైనల్- సెంట్రల్ జోన్ వర్సెస్ నార్త్ ఈస్ట్ జోన్
👉సౌత్ జోన్ (తొలి సెమీస్), వెస్ట్ జోన్ (రెండో సెమీస్) ఇప్పటికే సెమీ ఫైనల్ చేరగా.. సెప్టెంబరు 4-7 వరకు సెమీస్ మ్యాచ్లు జరుగుతాయి
👉సెప్టెంబరు 11- 15: ఫైనల్.
దులిప్ ట్రోఫీ-2025లో తలపడే వెస్ట్జోన్ జట్టు
శార్దూల్ ఠాకూర్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, ఆర్య దేశాయ్, హార్విక్ దేశాయ్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్, సర్ఫరాజ్ ఖాన్, రుతురాజ్ గైక్వాడ్, జైమీత్ పటేల్, మనన్ హింగ్రాజియా, సౌరభ్ నవలే (వికెట్ కీపర్), షమ్స్ ములానీ, తనుష్ కొటియాన్, ధర్మేంద్ర జడేజా, తుషార్ దేశ్పాండే, అర్జాన్ నాగ్వాస్వలా.
సౌత్ జోన్ జట్టు
తిలక్ వర్మ (కెప్టెన్), మొహమ్మద్ అజహరుద్దీన్, తన్మయ్ అగర్వాల్, దేవదత్ పడిక్కల్, మోహిత్ కాలె, సల్మాన్ నిజార్, నారాయణ్ జగదీశన్, త్రిపురాణ విజయ్, సాయి కిషోర్, తనయ్ త్యాగరాజన్, వైశాఖ్ విజయ్ కుమార్, ఎండీ ని«దీశ్, రికీ భుయ్, బాసిల్, గుర్జపనీత్ సింగ్, స్నేహల్ కౌథాంకర్. స్టాండ్బై: మోహిత్ రెడ్కర్, స్మరణ్, అంకిత్ శర్మ, యాపిల్ టామ్, సిద్ధార్థ్, షేక్ రషీద్