ఐపీఎల్-2026 సీజన్ ఫైనల్ బెర్త్ను గుజరాత్ టైటాన్స్ ఖరారు చేసుకుంది. ముల్లాన్పూర్ వేదికగా జరిగిన క్వాలిఫయర్-2లో రాజస్తాన్ రాయల్స్పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన గుజరాత్.. ముచ్చటగా మూడోసారి ఐపీఎల్ ఫైనల్లో అడుగుపెట్టింది. రాజస్తాన్ నిర్ధేశించిన 215 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ 18.4 ఓవర్లలో కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది.
ఈ విజయంలో కెప్టెన్ శుబ్మన్ గిల్ది కీలక పాత్ర. ఈ మ్యాచ్లో గిల్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. గిల్ కేవలం 53 బంతుల్లో 15 ఫోర్లు, 3 సిక్స్లతో 104 పరుగులు చేశాడు. గిల్తో పాటు సుదర్శన్(58) హాఫ్ సెంచరీతో రాణించాడు. వీరిద్దరూ తొలి వికెట్కు 167 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. రాజస్తాన్ బౌలర్లలో ఆర్చర్, బర్గర్, బ్రిజేష్ శర్మ తలా వికెట్ సాధించారు.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. రాజస్తాన్ బ్యాటర్లలో వైభవ్ సూర్యవంశీ విధ్వంసం సృష్టించాడు. వైభవ్ కేవలం 47 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్స్లతో 96 పరుగులు చేసి తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు.
అతడితో పాటు డొనొవాన్ ఫెరీరా(11 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్లతో 38) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. రవీంద్ర జడేజా(45) కూడా రాణించాడు. గుజరాత్ బౌలర్లలో జాసన్ హోల్డర్, రబాడ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ తలా వికెట్ సాధించారు. ఇక ఆదివారం జరగనున్న ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో గుజరాత్ అమీతుమీ తెల్చుకోనుంది.


