
Photo Courtesy: BCCI
భారత క్రికెట్లో కరుణ్ నాయర్ పరిచయం అక్కరలేని పేరు. సెహ్వాగ్ తర్వాత టెస్ట్ల్లో ట్రిపుల్ సెంచరీ (టీమిండియా తరఫున) చేసి, ఆతర్వాత కొద్ది రోజుల్లోనే కనుమరుగైన ఆటగాడు. సుదీర్ఘకాలం అవకాశాల కోసం వేచి చూసి ఇప్పుడిప్పుడే తన ప్రతిభకు తగ్గ అవకాశాలను పొందుతున్న కరుణ్.. తాజాగా ఐపీఎల్లో జరిగిన ఓ మ్యాచ్లో పేట్రేగిపోయి వార్తల్లో నిలిచాడు.
ఐపీఎల్ 2025లో భాగంగా నిన్న (ఏప్రిల్ 13) రాత్రి ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో కరుణ్ చిరస్మరణీయమైన ఇన్నింగ్స్ (40 బంతుల్లో 89; 12 ఫోర్లు, 5 సిక్సర్లు) ఆడాడు. అయినా ఈ మ్యాచ్లో ఢిల్లీ ఓటమిపాలైంది.
ముంబై ఇండియన్స్పై విధ్వంసకర ఇన్నింగ్స్ తర్వాత కరుణ్ క్రికెట్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారాడు. కరుణ్ గురించి తెలుసుకునేందుకు క్రికెట్ అభిమానులు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో కరుణ్ ఇటీవలికాల ప్రదర్శనలపై ఓ లుక్కేద్దాం.
2017 భారత్ తరఫున తన చివరి మ్యాచ్ ఆడి కనుమరుగైన కరుణ్, మళ్లీ పూర్వ వైభవం సాధించేందుకు చాలా కష్టపడ్డాడు. ఓ దశలో అతను ఎంత బాగా ఆడినా దేశవాలీ క్రికెట్లోనూ అవకాశాలు రాలేదు. దీంతో అతను జట్టును మార్చుకుని (కర్ణాటక) విదర్భ జట్టుకు వలస వచ్చాడు.
విదర్భకు రాగానే కరుణ్ దశ మారింది. దేశవాలీ క్రికెట్లో అంతకుముందు కంటే ఎక్కువ పరుగులు సాధించి తగినంత గుర్తింపు దక్కించుకున్నాడు. టీమిండియాలో చోటే లక్ష్యంగా కరుణ్ గతేడాది కాలంగా తీవ్రంగా శ్రమిస్తున్నారు.
ఈ క్రమంలో కరుణ్ గతేడాదంతా పరుగుల వరద పారించాడు. ఫార్మాట్లకతీతంగా విశేషంగా రాణించాడు. ఈ ఏడాది విజయ్ హజారే వన్డే టోర్నీలో 9 మ్యాచ్లు ఆడి నమ్మశక్యంకాని సగటుతో (389.50) 779 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు ఉన్నాయి.
ఈ ఏడాది రంజీ ట్రోఫీలోనూ కరుణ్ అదే జోష్ను కొనసాగించాడు. 16 ఇన్నింగ్స్ల్లో 57.33 సగటున 4 సెంచరీల సాయంతో 860 పరుగులు చేసి విదర్భ జట్టును ఛాంపియన్గా నిలపడంలో కీలక పాత్ర పోషించాడు.
కరుణ్ అరివీర భయంకరమైన ఫామ్ సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలోనూ కొనసాగింది. ఈ టోర్నీలో కరుణ్ 6 ఇన్నింగ్స్ల్లో 177.08 స్ట్రయిక్రేట్తో 42.50 సగటున 255 పరుగులు చేశాడు. ఇందులో 3 అర్ద సెంచరీలు ఉన్నాయి.
ఇవే కాక కరుణ్ గతేడాది ప్రారంభంలో జరిగిన మహారాజా ట్రోఫీలోనూ పరుగుల వరద పారించాడు. టీ20 ఫార్మాట్లో జరిగిన ఆ టోర్నీలో కరుణ్ 10 మ్యాచ్ల్లో 188.4 స్ట్రయిక్రేట్తో, 70 సగటున 490 పరుగులు చేశాడు. ఇందులో 4 అర్ద శతకాలు, ఓ శతకం ఉంది.
కరుణ్ గతేడాది కౌంటీ క్రికెట్లోనూ సత్తా చాటాడు. ఇంగ్లండ్ దేశవాలీ సీజన్లో కరుణ్ 11 ఇన్నింగ్స్ల్లో 48.70 సగటున 487 పరుగులు చేశాడు. ఇందులో ఓ డబుల్ సెంచరీ సహా మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
ఏడాదికి పైగా ఘనమైన ట్రాక్ రికార్డు మెయిన్టైన్ చేస్తూ వచ్చిన కరుణ్ను ఈ ఏడాది ఐపీఎల్ మెగా వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ 50 లక్షల బేస్ ధరకు కొనుగోలు చేసింది. ఈ సీజన్లోనూ కరుణ్ తన తొలి మ్యాచ్ ఆడేందుకు నాలుగు మ్యాచ్లు వేచి చూడాల్సి వచ్చింది. ఎట్టకేలకు తన అవకాశం రాగానే కరుణ్ తానేంటో మరోసారి నిరూపించుకున్నాడు. ముంబై ఇండియన్స్తో మ్యాచ్లో ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చి ఇరగదీశాడు.
బుమ్రా, బౌల్ట్ లాంటి ప్రపంచ శ్రేణి బౌలర్లకు చుక్కలు చూపించాడు. బుమ్రాను కరుణ్ బాదినట్లు ఏ బ్యాటర్ బాది ఉండడు. ఐపీఎల్లో రెండేళ్ల తర్వాత వచ్చిన అవకాశాన్ని కరుణ్ సద్వినియోగపరచుకున్నాడు. రీఎంట్రీలో తన ఐపీఎల్ అత్యధిక స్కోర్ను నమోదు చేశాడు.
తాజా ప్రదర్శనల నేపథ్యంలో కరుణ్ టీమిండియా బెర్త్ సాధించడం కన్ఫర్మ్ అని క్రికెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరి భారత సెలెక్టర్లు కరుణ్ లాంటి హార్డ్ వర్కింగ్ టాలెంట్కు అవకాశం ఇస్తారో లేదో చూడాలి.