
ఇంగ్లండ్ గడ్డపై వార్మప్ మ్యాచ్ల్లో భారత మహిళల జట్టు ఓటమి
వన్డే వార్మప్ పోరులో హర్లీన్ డియోల్ సెంచరీ వృథా
టి20 ప్రాక్టీస్ మ్యాచ్లో స్మృతి మంధాన మెరుపులు
బాకెన్హామ్: భారత పురుషుల క్రికెట్ జట్టు ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా లీడ్స్ వేదికగా జరిగిన తొలి టెస్టులో పరాజయం పాలవగా... మరోవైపు మహిళల జట్టు ప్రధాన సిరీస్ల ప్రారంభానికి ముందు జరిగిన రెండు ప్రాక్టీస్ మ్యాచ్ల్లోనూ ఓడింది. 5 టి20లు, 3 వన్డేల సిరీస్లు ఆడేందుకు భారత జట్టు ఇంగ్లండ్లో పర్యటిస్తోంది. శనివారం భారత్, ఇంగ్లండ్ మధ్య తొలి టి20 జరగనుంది. దీనికి ముందు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) డెవలప్మెంట్ ఎలెవన్తో జరిగిన వన్డే, టి20 టూర్ మ్యాచ్ల్లో భారత్ పరాజయం పాలైంది.
మంగళవారం జరిగిన ప్రాక్టీస్ వన్డే పోరులో హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత్ 18 పరుగుల తేడాతో ఓడింది. మొదట బ్యాటింగ్ చేసిన ఈసీబీ ఎలెవన్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 353 పరుగులు చేసింది. మైయా బౌచర్ (84 బంతుల్లో 104; 16 ఫోర్లు) సెంచరీతో కదంతొక్కగా... ఎమ్మా లాంబ్ (92 బంతుల్లో 94; 15 ఫోర్లు) దంచికొట్టింది. వీరిద్దరూ తొలి వికెట్కు 196 పరుగులు జోడించడంతో ఈసీబీ జట్టు భారీ స్కోరు చేయగలిగింది. భారత బౌలర్లలో తెలుగమ్మాయి శ్రీచరణి 3 వికెట్లు పడగొట్టగా... స్నేహ్ రాణా, రాధా యాదవ్ చెరో వికెట్ పడగొట్టారు.
అనంతరం లక్ష్యఛేదనలో భారత మహిళల జట్టు 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 335 పరుగులకు పరిమితమైంది. హర్లీన్ డియోల్ (91 బంతుల్లో 100; 14 ఫోర్లు, 1 సిక్స్) ‘శత’క్కొట్టగా... కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (47 బంతుల్లో 54; 5 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్సెంచరీ సాధించింది. స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన (1), జెమీమా రోడ్రిగ్స్ (5), రిచా ఘోష్ (5), షఫాలీ వర్మ (16) విఫలమయ్యారు.
అమన్జ్యోత్ కౌర్ (32 బంతుల్లో 43; 6 ఫోర్లు), యస్తిక భాటియా (45 బంతుల్లో 32; 3 ఫోర్లు), హైదరాబాద్ ప్లేయర్ అరుంధతి రెడ్డి (21 బంతుల్లో 30 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) పోరాడారు. ఈసీబీ బౌలర్లలో ర్యానా మెక్డొనాల్డ్, మహికా గౌర్, సారా గ్లెన్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. అందరికీ ప్రాక్టీస్ దక్కాలనే ఉద్దేశంతో హర్లీన్ డియోల్ శతకం అనంతరం రిటైర్డ్ నాటౌట్గా పెవిలియన్ చేరింది.
టి20లోనూ తప్పని ఓటమి...
ప్రాక్టీస్ వన్డేలో పరాజయం పాలైన టీమిండియాకు... టి20లోనూ ఓటమే ఎదురైంది. బుధవారం జరిగిన ఈ మ్యాచ్లో హర్మన్ బృందం 6 పరుగుల తేడాతో ఈసీబీ ఎలెవన్ చేతిలో ఓడింది. మొదట బ్యాటింగ్ చేసిన ఈసీబీ ఎలెవన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 194 పరుగులు చేసింది. బ్రియోనీ స్మిత్ (33 బంతుల్లో 62; 8 ఫోర్లు, 3 సిక్స్లు) మెరుపు అర్ధశతకం బాదగా... కెప్టెన్ హోలీ ఆర్మిటేజ్ (32 బంతుల్లో 48; 7 ఫోర్లు), మైయా బౌచర్ (25 బంతుల్లో 35; 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు.
భారత బౌలర్లలో అమన్జ్యోత్ కౌర్, స్నేహ్ రాణా చెరో 2 వికెట్లు పడగొట్టగా... దీప్తి శర్మ, రాధ యాదవ్ చెరో వికెట్ తీశారు. అనంతరం లక్ష్యఛేదనలో టీమిండియా 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 188 పరుగులకు పరిమితమైంది. స్మృతి మంధాన (28 బంతుల్లో 47; 10 ఫోర్లు) ధాటిగా ఆడగా... మిగిలినవాళ్లు పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. షఫాలీ వర్మ (13), అమన్జ్యోత్ కౌర్ (15), హర్మన్ప్రీత్ కౌర్ (28), జెమీమా రోడ్రిగ్స్ (11), రాధా యాదవ్ (17) ఎక్కువసేపు నిలవలేకపోయారు. రిచా ఘోష్ (23 బంతుల్లో 37; 4 ఫోర్లు, 1 సిక్స్) వేగంగా ఆడింది. ఈసీబీ బౌలర్లలో సారా గ్లెన్ 3 వికెట్లు పడగొట్టింది.